Bihar: మరో ఆరు నెలల్లో తేజస్వి యాదవ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు: అధికార జేడీయూ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

  • సోషల్ మీడియాకెక్కి రచ్చ చేస్తున్న ఆడియో
  • బీజేపీ జిల్లా అధ్యక్షుడు రోహిత్ పాండేకు పొగరన్న మండల్
  • తాను ప్రచారం చేయకపోవడం వల్లే ఆయన ఓడారని వ్యాఖ్య
JDU MLA Gopal Mandal sensational comments on Nitish Kumar

బీహార్‌లోని అధికార జేడీయూ ఎమ్మెల్యే గోపాల్ మండల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఆరు నెలల్లో ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటారని, ఆ తర్వాత ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని అన్నారు. గోపాల్ మండల్, బిహ్‌పూర్ ఎమ్మెల్యే ఇ.శైలేంద్ర మధ్య బుధవారం జరిగిన ఫోన్ సంభాషణలో ఈ విషయం వెలుగుచూసింది. దీంతో ఒక్కసారిగా అధికారపార్టీలో కలకలం రేగింది.

అంతేకాదు, బీజేపీ జిల్లా చీఫ్ రోహిత్ పాండేపైనా మండల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఆడియోలో స్పష్టంగా వినిపిస్తోంది. భాగల్పూర్ నుంచి బరిలోకి దిగిన రోహిత్ పాండే కాంగ్రెస్ నేత అజీత్ శర్మ చేతిలో పరాజయం పాలయ్యారు. తాను ప్రచారం చేసిన కూటమి అభ్యర్థులు విజయం సాధించారని, రోహిత్‌కు చాలా పొగరని, అందుకే తాను ఆయన కోసం ప్రచారం చేయలేదని అన్నారు. అందుకనే ఆయన ఓడిపోయారని పేర్కొన్నారు.

మండల్ ఆడియో సోషల్ మీడియాకెక్కి రచ్చ కావడంతో నవగచియా జేడీయూ నేతలు నిన్న మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మండల్ మాట్లాడుతూ ఆ ఆడియో తనది కాదని చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే శైలేంద్ర ఈ ఆడియోను వైరల్ చేశారని, ఇదెక్కడి పద్ధతని ఆగ్రహం వ్యక్తం చేశారు.

More Telugu News