Telangana: మరో మూడు రోజుల పాటు తెలంగాణలో తీవ్రమైన చలి

  • తూర్పు దిశ నుంచి వీస్తున్న చలిగాలులు
  • గల్ఫ్ ఆఫ్ మన్నార్ మీదుగా ఉపరితల ఆవర్తనం
  • ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న వాతావరణ శాఖ అధికారులు

తెలంగాణపై చలి పులి పంజా విసిరింది. రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. తీవ్రమైన చలితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పలు జిల్లాల్లో ఉదయం 10 గంటలు అయినా పొగమంచు వీడటం లేదు. ఆదిలాబాద్, కామారెడ్డి జిల్లాల్లో తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్ లో 14 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత, కామారెడ్డిలో 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు రాబోయే మరో మూడు, నాలుగు రోజులు చలి తీవ్రత మరింత పెరుగుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

గల్ఫ్ ఆఫ్ మన్నార్ మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని... దాని ఫలితంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. తూర్పు దిశ నుంచి చలిగాలులు వీస్తున్నాయని.. వీటన్నిటి ఫలితంగా చలి తీవ్రత పెరిగే అవకాశం ఉందని తెలిపారు. చలి నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నవారు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

More Telugu News