nepal: అలా జ‌రిగి ఉంటే భార‌త్ లో నేపాల్ విలీన‌మ‌య్యేది: ప‌్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ ఆత్మ‌క‌థ‌లో కీల‌క విష‌యాలు

  • అప్ప‌ట్లో‌ భారత్‌లో విలీనమయ్యేందుకు నేపాల్ ప్ర‌తిపాద‌న
  • జవహర్‌లాల్‌ నెహ్రూ  దాన్ని  తిరస్కరించారు
  • ప్ర‌ధానిగా ఇందిరా గాంధీ ఉండి ఉంటే ఆ కథ వేరేలా ఉండేది
  • సిక్కిం తరహాలోనే భారత్‌లో నేపాల్‌ అంతర్భాగం అయ్యేది
nepal would have merge in india

మాజీ రాష్ట్రపతి దివంగ‌త‌ ప్రణబ్‌ ముఖర్జీ ఆత్మకథ ‘ది ప్రెసిడెన్షియల్‌ ఇయర్స్‌’లో ప‌లు కీల‌క అంశాల‌ను పేర్కొన్నారు. తాజాగా అది మార్కెట్లో విడుద‌లైంది. అప్ప‌ట్లో‌ భారత్‌లో విలీనమయ్యేందుకు నేపాల్ ప్ర‌తిపాద‌న చేసిప్ప‌టికీ మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ  దాన్ని తిరస్కరించారని అందులో ప్ర‌బ‌ణ్‌ చెప్పారు. నేపాల్‌ స్వతంత్ర రాజ్యమని, ఆ దేశం అలాగే ఉండాలని ఆయన భావించార‌ని తెలిపారు.

అయితే, అప్ప‌ట్లో ప్ర‌ధానిగా ఇందిరా గాంధీ ఉండి ఉంటే ఆ కథ వేరేలా ఉండేదని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. సిక్కిం తరహాలోనే భారత్‌లో నేపాల్‌ అంతర్భాగం అయ్యేదని తెలిపారు. కాగా, ప్ర‌స్తుత‌ ప్రధానమంత్రి న‌రేంద్ర‌ మోదీ పార్లమెంటు సమావేశాల్లో తరచూ మాట్లాడాలని ప్ర‌ణ‌బ్ ఆత్మ‌క‌థ‌లో రాసుకొచ్చారు. విపక్షాలు చెప్పే విష‌యాల‌ను మోదీ తప్పకుండా వినాలని అన్నారు. ప్రతిపక్షాలను ఒప్పించి, మోదీ తన వాణిని దేశానికి వినిపించేందుకు పార్లమెంటును వేదికగా చేసుకోవాలని ఆయ‌న సూచించారు.

మాజీ ప్రధానులను మోదీ స్ఫూర్తిగా తీసుకోవాలని, పార్ల‌మెంటు స‌మావేశాల‌కు హాజ‌రు కావాల‌ని తెలిపారు. అలాగే, 2016 లో మోదీ పెద్ద నోట్ల రద్దు విషయాన్ని రాష్ట్రపతిగా ఉన్న తనతో చర్చించలేదని, అయితే, ఇందులో త‌ప్పేలేద‌ని ఆయ‌న చెప్పారు. ఇటువంటి చ‌ర్య‌ల‌పై ఎవ‌రూ ఊహించ‌ని విధంగానే ప్ర‌క‌ట‌న చేయాల్సి ఉంటుంద‌ని చెప్పారు.

 కాగా, కాంగ్రెస్ పార్టీ త‌మలో ప్రజాకర్షక నాయకత్వాన్ని కోల్పోయిన విషయాన్ని గుర్తించలేదని, ఇటువంటి కార‌ణాల వ‌ల్లే 2014 ఎన్నిక‌ల్లో ఓట‌మి పాల‌యింద‌ని ప్ర‌ణ‌బ్ తెలిపారు. అంత‌కు ముందు కూడా యూపీఏ ప్ర‌భుత్వంలో గొప్ప నాయ‌కత్వం లేద‌ని ఆయ‌న చెప్ప‌డం గ‌మ‌నార్హం. అందుకే పాల‌న సాధార‌ణ స్థాయిలో కొన‌సాగింద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

More Telugu News