India: రష్యా ఆయుధాలను కొంటే ఇండియాపై ఆంక్షలు: హెచ్చరించిన యూఎస్

  • ఐదు బిలియన్ డాలర్లతో రష్యాతో డీల్ కుదుర్చుకున్న ఇండియా
  • అమెరికా క్షిపణి నిరోధక వ్యవస్థలతో పోలిస్తే, మెరుగ్గా ఎస్-400
  • ఆంక్షలు విధించాల్సిందేనని యూఎస్ కాంగ్రెస్ స్వతంత్ర రిపోర్టు
Sanctions on India if S 400 Deal with Russia warns USA

వందల కోట్ల రూపాయల విలువైన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ను రష్యా నుంచి కొనుగోలు చేయాలని భావిస్తున్న ఇండియాకు అమెరికా రూపంలో అడ్డంకులు తగులుతున్నాయి. ఈ అత్యాధునిక మిసైల్ సిస్టమ్ ను రష్యా నుంచి కొనేందుకు గతంలోనే ఇండియా డీల్ కుదుర్చుకోగా, తాజాగా విడుదలైన యూఎస్ కాంగ్రెస్ రిపోర్టు, ఇండియా ఆయుధాలు కొనుగోలు చేస్తే, ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. యూఎస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సీఆర్ఎస్ (కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్) తన తాజా నివేదికలో భారత్ తన రక్షణ విధానాన్ని మార్చుకోవాలని, సంస్కరణలు తీసుకు రావాలని సూచించింది.

మరింత సాంకేతికతను అందుకోవాలన్న ప్రయత్నాలు కూడదని, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిధిని మరింతగా పెంచాలని, రక్షణ విధానాన్ని మార్చుకోవాలని సూచించింది. "రష్యా తయారు చేసుకున్న ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు మేము వ్యతిరేకం. వీటిని ఇండియా కొనుగోలు చేస్తే, ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షల చట్టానికి ఇండియా - రష్యా డీల్ వ్యతిరేకంగా ఉండటమే ఇందుకు కారణం" అని సీఆర్ఎస్ పేర్కొంది.

కాగా, సీఆర్ఎస్ నివేదిక అధికారిక నివేదిక కాకపోయినా, రెండు పార్టీలకు చెందిన స్వతంత్ర సభ్యులు తయారు చేస్తుంటారు. దీని ఆధారంగా పలు కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఇదే సమయంలో ఆంక్షలు విధించే దేశంతో ఉన్న ద్వైపాక్షిక బంధం ఆధారంగానే తుది నిర్ణయాలు ఉంటాయి.

వాస్తవానికి ఈ మిసైల్స్ కోసం 2018లో ఐదు బిలియన్ డాలర్ల విలువైన డీల్ కుదుర్చుకున్న ఇండియా, 2019లో 800 మిలియన్ డాలర్ల అడ్వాన్స్ కూడా ఇచ్చింది. ఆ సమయంలో ట్రంప్ ప్రభుత్వం ఎన్ని హెచ్చరికలు చేసినా, మోదీ సర్కారు వెనుకంజ వేయలేదు. ఇండియాకు ఇరుగు, పొరుగున ఉన్న దేశాల నుంచి ఉన్న ముప్పు నేపథ్యంలో వీటి కొనుగోలు తప్పనిసరని ఇండియా అంటోంది. ఇదే సమయంలో రష్యా సైతం భారత్ కు అనుకూలంగానే మాట్లాడుతుండగా, అమెరికా మాత్రం ఈ డీల్ విషయంలో కొంత కఠినంగానే ఉంది.

ఇందుకు మరో కారణం కూడా ఉంది. ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, ప్రపంచంలోనే ఎదురులేనిది. యూఎస్ తయారు చేసిన ఇదే తరహా మిసైల్స్ థాడ్, పేట్రియాట్ లతో పోలిస్తే ఎస్-400 బాగా పనిచేస్తాయి. ఈ రెండు రకాల వ్యవస్థలను ఇండియాకు విక్రయించాలని అమెరికా గతంలో ప్రయత్నించగా, మోదీ ప్రభుత్వం మాత్రం రష్యా వైపు మొగ్గు చూపింది.

ఈ వ్యవస్థ శత్రువుల విమానాలతో పాటు డ్రోన్ లను, క్షిపణులను కూల్చి వేయగలుగుతుంది. విమానాలు 30 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నా, 400 కిలోమీటర్ల దూరంలోనే గుర్తించి, ఎదురుదాడికి దిగుతుంది. ఒకే సమయంలో 30 వరకూ విమానాలు, యూఏవీలు, క్షిపణులను ఎదుర్కొనే సత్తా దీని సొంతం. అంతే కాదు... వీటిని ఎక్కడికైనా సులువుగా తీసుకుని వెళ్లి, 5 నిమిషాల్లోనే ఎదురుదాడికి సిద్ధం చేసే వీలుండటంతో పాటు, విమానాలు, నౌకలు, భూమిపై నుంచి కూడా వీటిని వినియోగించవచ్చు.

More Telugu News