Tamil Nadu: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడితో హీరో విజయ్ భేటీ.. కోలీవుడ్‌లో కొత్త చర్చ!

  • విజయ్ వెంట ‘మాస్టర్’ చిత్ర నిర్మాత కూడా
  • 100 శాతం మంది ప్రేక్షకులను అనుమతించాలని విన్నవించిన విజయ్
  • సానుకూలంగా స్పందించిన పళనిస్వామి
Tamil Hero Vijay meets Tamil CM Palani Swamy

ప్రముఖ తమిళ హీరో విజయ్ ఆదివారం రాత్రి ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామిని కలుసుకోవడం అటు రాజకీయాల్లోను, ఇటు కోలీవుడ్‌లోనూ చర్చకు దారితీసింది. వీరి  భేటీపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. విజయ్ రాజకీయాల్లోకి రాబోతున్నారంటూ ఇటీవల వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఆయన ముఖ్యమంత్రిని కలిసి ఉంటారని కొందరు చెబుతుండగా, కాదు.. త్వరలోనే విడుదలకానున్న సినిమా విషయంలో చర్చించేందుకే ఆయన సీఎంతో భేటీ అయ్యారని మరికొందరు చెబుతున్నారు.

 విజయ్ నటించిన ‘మాస్టర్’ సినిమా సంక్రాంతిని పురస్కరించుకుని వచ్చే నెల 13న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. కరోనా నేపథ్యంలో 50 శాతం మంది ప్రేక్షకులకు మాత్రమే థియేటర్లలోకి అనుమతి ఉంది. దీంతో, పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అనుమతించాలంటూ ఇటీవల ఈ సినిమా దర్శక, నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరారు.

 అయితే, ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేకపోవడంతో స్వయంగా రంగంలోకి దిగిన విజయ్ ఆదివారం రాత్రి అడయార్‌లోని సీఎం క్యాంపు కార్యాలయంలో పళనిస్వామితో భేటీ అయ్యారు. మున్సిపల్ శాఖ మంత్రి వేణుమణి, ‘మాస్టర్’ చిత్ర నిర్మాత లలిత్ కుమార్ కూడా ఇందులో పాల్గొన్నట్టు తెలుస్తోంది. థియేటర్లలోకి వందశాతం ప్రేక్షకులను అనుమతించాలన్న విజయ్ అభ్యర్థనపై సీఎం సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది.

More Telugu News