Bandi Sanjay: ఒక్క మంత్రి కూడా బయటకు రాలేరు: టీఆర్ఎస్ కు బండి సంజయ్ హెచ్చరిక

  • బీజేపీ కార్యకర్తలను అడ్డుకుంటే చూస్తూ ఊరుకోం
  • దాడి చేస్తే కచ్చితంగా ప్రతిదాడి చేస్తాం
  • కేసీఆర్ నిర్ణయాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు
Bandi Sanjay gives fresh warning to TRS

టీఆర్ఎస్ పార్టీపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. జగిత్యాలలో తన పర్యటనను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్యకర్తలను అడ్డుకోవడానికి టీఆర్ఎస్ శ్రేణులు యత్నిస్తే... రాష్ట్రంలో మంత్రులెవరూ ఇంటి నుంచి బయటకు కూడా రాలేరని హెచ్చరించారు. తమపై దాడి చేస్తే తాము కచ్చితంగా ప్రతిదాడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.  జగిత్యాలలో రైతులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలను రైతులందరూ స్వాగతిస్తున్నారని సంజయ్ అన్నారు. రాజకీయ కారణాలతో రైతులను పక్కదోవ పట్టించేందుకు టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు యత్నిస్తున్నాయని విమర్శించారు. కొత్త వ్యవసాయ చట్టాలను ఎందుకు వ్యతిరేకిస్తున్నారో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. సన్న వడ్లు పండించాలని చెప్పి రైతులను కేసీఆర్ ముంచేశారని చెప్పారు. కేసీఆర్ నిర్ణయాల వల్ల రాష్ట్ర రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఎల్ఆర్ఎస్ ను రద్దు చేసేంత వరకు బీజేపీ పోరాటం ఆగదని చెప్పారు. ఎల్ఆర్ఎస్ పేరుతో పేద ప్రజలను ప్రభుత్వం మోసం చేస్తోందని విమర్శించారు.

More Telugu News