ఓపక్క దేశ ఆర్థిక వ్యవస్థ పరుగులు.. మరోపక్క సవాళ్లూ వున్నాయి: ఆర్బీఐ నివేదిక

RBI says Indias economy recovering faster warns about worm in the apple
  • అంచనాలను మించి బలపడుతున్న ఆర్థిక వ్యవస్థ
  • పంజుకుంటున్న లాక్ డౌన్ లో దెబ్బతిన్న రంగాలు
  • ఆర్థిక వృద్ధికి ద్రవ్యోల్బణం మోకాలడ్డే ప్రమాదం
  • లక్ష్యం కన్నా 2-6% ఎక్కువే ఉన్న ద్రవ్యోల్బణం
దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా పుంజుకుంటోందని, వృద్ధి పథంలో వెళుతోందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) వెల్లడించింది. అయితే, ఆ ఆర్థిక వృద్ధికి ఎదురుగాలులు వీచే ముప్పూ పొంచి ఉందని హెచ్చరించింది. దేశ ఆర్థిక స్థితిగతులపై ఇటీవలే ఆర్బీఐ ఓ నివేదిక విడుదల చేసింది. అందులో ఈ విషయాలను వెల్లడించింది.

కొవిడ్ 19 చేసిన నష్టం నుంచి ఆర్థిక వ్యవస్థ బయటపడుతోందని, అంచనాలను మించి ముందుకు పరిగెడుతోందని పేర్కొంది. మూడో త్రైమాసికంలో వాస్తవ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) సానుకూల వృద్ధిని నమోదు చేసే అవకాశాలున్నాయని చెప్పింది. దేశంలో ప్రతి వారం కరోనా కేసులు భారీగా తగ్గిపోవడం, మహమ్మారి బారిన పడి కోలుకున్నవారి సంఖ్య 95 శాతం దాటడం, సెకండ్ వేవ్ జాడ లేకపోవడం వంటి కారణాలతో ఆర్థిక వృద్ధి కూడా పుంజుకుంటోందని చెప్పింది.

లాక్ డౌన్ లో భారీగా దెబ్బతిన్న వాహన రంగం, వస్తు పెట్టుబడుల (క్యాపిటల్ గూడ్స్) రంగాలు మళ్లీ గాడిన పడుతున్నాయని పేర్కొంది. ఆరోగ్య రంగం, ఐటీ, ఎఫ్ఎంసీజీ (ఆహార ఉత్పత్తుల రంగం) సంస్థలకు ఆదాయం బాగా వస్తోందని చెప్పింది. రుణ సేవల సామర్థ్యం పెరగడంతో తయారీ, సేవల రంగాలూ బలపడుతున్నాయని వెల్లడించింది. మార్కెటింగ్ లో సంస్కరణల ఫలితంగా వ్యవసాయ రంగం కూడా దూసుకుపోతోందని రిపోర్ట్ లో ఆర్బీఐ పేర్కొంది.

ఇది ఇలాగే కొనసాగితే దేశ ఆర్థిక వ్యవస్థ మరింత మెరుగవుతుందని ఆర్బీఐ ఆశాభావం వ్యక్తం చేసింది. అంచనాలను మించి చివరి త్రైమాసికం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని చెప్పింది. అయితే, పుంజుకుంటున్న ఆర్థిక వ్యవస్థకు సవాళ్లూ ఎదురయ్యే ముప్పుందని ఆర్బీఐ హెచ్చరించింది. ప్రస్తుతం రిటైల్ ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండడంపై ఆందోళన వ్యక్తం చేసింది. నవంబర్ లో ద్రవ్యోల్బణం కొంచెం తగ్గి 6.93 శాతం వద్ద నిలిచింది. అయితే అది కూడా పెట్టుకున్న లక్ష్యానికి చాలా ఎక్కువని ఆర్బీఐ చెప్పింది. 2 నుంచి 6 శాతం ఎక్కువుందని పేర్కొంది.

కాబట్టి ఇప్పుడిప్పుడే పుంజుకుంటున్న ఆర్థిక వృద్ధిని ద్రవ్యోల్బణం దెబ్బతీయకుండా చూడాల్సిన అవసరం ఉందని సూచించింది. సరఫరా నిర్వహణను సమయానికి జరిగేలా సమర్థమైన ప్రభావవంతమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. అందకుండా పరుగులు పెడుతున్న రిటైల్ మార్జిన్లపై దృష్టిపెట్టడం, వినియోగదారులపై భారాన్ని పెంచుతున్న పరోక్ష పన్నులను తగ్గించడం వంటి చర్యల ద్వారా ద్రవ్యోల్బణం పెరగకుండా చూడొచ్చని సూచించింది.
Go Back to Shorts
RBI
Inflation
Economy
Lockdown
COVID19

More Telugu News