Night Curfew: నైట్ కర్ఫ్యూ ఆదేశాలను ఉపసంహరించుకున్న కర్ణాటక ప్రభుత్వం

  • బ్రిటన్ లో కరోనా కొత్త స్ట్రెయిన్ విజృంభణ
  • భారత్ లోనూ కలకలం
  • నైట్ కర్ఫ్యూ అంటూ నిన్న ఆదేశించిన కర్ణాటక
  • మరోసారి సమీక్ష
  • తాజాగా ప్రకటన చేసిన సీఎంఓ
Karnataka withdraws night curfew orders

బ్రిటన్ లో కొత్తరకం కరోనా వైరస్ ఉద్ధృతంగా వ్యాపిస్తోన్న తరుణంలో కర్ణాటక ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన సంగతి తెలిసిందే. డిసెంబరు 24 నుంచి జనవరి 1 వరకు రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు కర్ఫ్యూ అమలు చేయాలని భావించారు. ఈ మేరకు నిన్న ఆదేశాలు కూడా వెలువడ్డాయి. అయితే, తాజాగా మరోసారి సమీక్ష నిర్వహించిన అనంతరం కర్ణాటక ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ ఆదేశాలను వెనక్కితీసుకుంటున్నట్టు ప్రకటించింది. నైట్ కర్ఫ్యూ విధించాల్సినంత పరిస్థితులు రాష్ట్రంలోనూ, ఇతర ప్రాంతాల్లోనూ లేవని యడియూరప్ప సర్కారు భావిస్తోంది. దీనిపై సీఎంఓ ఓ ప్రకటన చేసింది.

"నిపుణుల హెచ్చరికల మేరకు కరోనా కొత్త స్ట్రెయిన్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇంతక్రితం నైట్ కర్ఫ్యూ ఆదేశాలు ఇచ్చాం. అయితే ప్రజానీకం నుంచి వస్తున్న స్పందనలతో మరోసారి సమీక్షించాం. దీనిపై కేబినెట్ సహచరులు, సీనియర్ అధికారులతో చర్చించి నైట్ కర్ఫ్యూ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నాం" అని వివరించింది. అయితే, ప్రజలు భౌతికదూరం, మాస్కులు, శానిటైజర్ల వినియోగం వంటి నిబంధనలు పక్కాగా పాటించాలని ఆ ప్రకటనలో స్పష్టం చేశారు.

More Telugu News