Raja Singh: ముదురుతున్న వివాదం.. సజ్జనార్ కు రాజాసింగ్ తాజా సవాల్!

  • రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామన్న సజ్జనార్
  • నేను చెప్పింది నిజం కాకపోతే ఏ యాక్షన్ అయినా తీసుకోవచ్చంటూ రాజాసింగ్ సవాల్
  • నిజమైతే పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్
Raja Singhs fresh challenge to CP Sajjanar

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. పోలీసులపై విమర్శలు గుప్పించడం రాజకీయ నాయకులకు ఫ్యాషన్ అయిపోయిందంటూ నిన్న సజ్జనార్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ప్రజల రక్షణ కోసం పని చేస్తున్న పోలీసులను కించపరిచే విధంగా మాట్లాడితే కేసులు పెడతామని హెచ్చరించారు. పోలీసులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాజాసింగ్ పై లీగల్ యాక్షన్ తీసుకుంటామని అన్నారు.

గోవులు, ఎద్దులను తరలిస్తున్న వారిని పోలీసులు పట్టించుకోవడం లేదని... వారి నుండి డబ్బులు తీసుకుని వదిలేస్తున్నారంటూ రాజాసింగ్ తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. దీనికి డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలోనే రాజాసింగ్ పై యాక్షన్ తీసుకుంటామని సజ్జనార్ అన్నారు. ఈ వ్యాఖ్యలపై రాజాసింగ్ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు.

'సజ్జనార్ గారికి సవాల్ చేస్తున్నా'నంటూ రాజాసింగ్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. మీ కమిషనరేట్ పరిధిలో ఎన్నో పోలీస్ స్టేషన్లు ఉన్నాయని... ఆవులను, ఎద్దులను కోయడానికి ఆయా పోలీస్ స్టేషన్ల ముందు నుంచి ఇల్లీగల్ గా వాహనాలలో వాటిని తీసుకెళ్తున్నారా? లేదా? అనే విషయంపై వాటన్నింటి నుంచి రిపోర్ట్ తెప్పించుకుని చూడాలని అన్నారు. తాను చెప్పింది నిజం కాకపోతే తనపై ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోవచ్చని సవాల్ విసిరారు. తన ఆరోపణలు నిజమైతే బాధ్యులైన పోలీసులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ఆవులను అక్రమంగా తరలిస్తున్న వారిని అడ్డుకుని పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్తే... తిరిగి వారినే పోలీసులు తిడుతున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. రిటర్న్ కేసులు పెడుతున్నారని, రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని బెదిరిస్తున్నారని దుయ్యబట్టారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు టోల్  గేట్స్, మెయిన్ రోడ్లపై కానిస్టేబుళ్లను పెట్టాలని... అప్పుడు తాము రోడ్లపైకి రామని చెప్పారు. లేకపోతే తాము ఇలాగే చేస్తామని... ఏం చేసుకుంటారో చేసుకోండని సవాల్ విసిరారు.

More Telugu News