Telangana: బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన 18 మందికి కరోనా పాజిటివ్.. కొత్తదా? పాతదా?

  • గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించి చికిత్స
  • వారితో కాంటాక్ట్ అయిన వారిని నేచర్‌క్యూర్‌కు తరలించాలని నిర్ణయం
  • గత నెల రోజుల్లో మూడు వేల మందికిపై తెలంగాణకు
  • అప్రమత్తంగా ఉండాలన్న కేంద్రం
18 passengers tested positive in Hyderabad who came from britain

బ్రిటన్ నుంచి హైదరాబాద్ వచ్చిన ప్రయాణికుల్లో ఇప్పటి వరకు 18 మంది కరోనా వైరస్ బారినపడినట్టు నిర్ధారణ అయింది. విమానాశ్రయంలో చేస్తున్న ఆర్టీ‌పీసీఆర్ పరీక్షల్లో వీరికి వైరస్ సోకినట్టు నిర్ధారణ అయింది. మంగళవారం 16 మందికి నిర్ధారణ కాగా, 11, 13 తేదీల్లో ఇద్దరికి వైరస్ సంక్రమించినట్టు పరీక్షల్లో తేలింది. వీరిని గచ్చిబౌలిలోని టిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, వారికి సోకినది కరోనా వైరస్ కొత్త స్ట్రెయినా? లేక, పాతదా? అన్నది తేలాల్సి ఉంది.

బ్రిటన్ నుంచి వచ్చేవారు కొత్త కరోనా వైరస్ బారినపడినట్టయితే, వారిని టిమ్స్‌లో చేర్చి, వారితో కాంట్రాక్ట్ అయిన కుటుంబ సభ్యులకు మాత్రం అమీర్‌పేటలోని నేచర్ క్యూర్ ఆసుపత్రిలో వైద్యం అందించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. కాగా, గత నాలుగు వారాల వ్యవధిలో బ్రిటన్ సహా వివిధ దేశాల నుంచి తెలంగాణకు మూడువేల మందికిపైగా వచ్చినట్టు కేంద్రం నుంచి రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖకు సమాచారం అందింది. దీంతో వీరిలో ముందుగా వచ్చిన 1500 మందిని వైద్యుల పరిశీలనలో ఉంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. నేడు మరో 1500 మందికి ఆర్టీపీసీఆర్ పరీక్షలు నిర్వహించనున్నారు.  

బ్రిటన్‌లో వెలుగు చూసిన వైరస్ కొత్త జాతి నేపథ్యంలో అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం బ్రిటన్ సహా కొత్త జాతి ఉనికి ఉన్న దేశాల నుంచి వచ్చే వారికి కరోనా పరీక్షలు నిర్వహించాలని, పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను జినోమ్ సీక్వెన్సీ ల్యాబ్‌కు పంపాలని ఆదేశించింది. వాటిలో వైరస్ తీవ్రతను తెలుసుకునేందుకు పూణెలోని వైరాలజీ ల్యాబ్‌కు పంపాలని సూచించింది.

More Telugu News