Christmas: క్రిస్మస్ జాతీయ సెలవు దినం కాదా?: కేంద్రంపై నిప్పులు చెరిగిన మమతా బెనర్జీ!

  • లౌకికవాదాన్ని నాశనం చేయడమే బీజేపీ లక్ష్యం
  • గతంలో ఉన్న సెలవును తొలగించిన బీజేపీ
  • క్రిస్మస్ పండగ ఏం తప్పు చేసిందన్న మమతా బెనర్జీ
Why Christmas is not National Holiday Questions Mamata Benerjee

క్రైస్తవులు అత్యంత వైభవంగా జరుపుకునే క్రిస్మస్ పర్వదినం నాడు జాతీయ సెలవు దినాన్ని ప్రకటించక పోవడం అన్నది మత ద్వేష రాజకీయాలను ప్రోత్సహించాలన్న బీజేపీ అజెండాయేనని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ నిప్పులు చెరిగారు.

తాజాగా కోల్ కతాలోని పార్క్ స్ట్రీట్ లో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఆమె, "గత సంవత్సరం చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాను. జీసస్ జన్మదినాన్ని జాతీయ సెలవుగా ఎందుకు ప్రకటించడం లేదు? గతంలో ఉన్న సెలవును బీజేపీ ప్రభుత్వం ఎందుకు తొలగించింది? ప్రతి ఒక్కరికీ సెంటిమెంట్లు ఉంటాయి. క్రిస్మస్ పండగ ఏం తప్పు చేసింది. ఈ పండగను ప్రపంచమంతా జరుపుకుంటారని తెలియదా?" అని మమత ప్రశ్నించారు.

ఈ సంవత్సరం కరోనా మహమ్మారి కారణంగా పూర్తి స్థాయి వేడుకలకు కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయని పేర్కొన్న ఆమె, ప్రజలంతా మాస్క్ లు ధరించి, భౌతిక దూరం పాటిస్తూ, ఏసు జన్మదిన వేడుకలను జరుపుకోవాలని సూచించారు. ఇండియాలో లౌకికవాదాన్ని నాశనం చేయడమే బీజేపీ లక్ష్యంగా కనిపిస్తోందని ఆమె మండిపడ్డారు. ఇండియాలో ప్రస్తుతం అత్యంత క్రూరమైన మత రాజకీయాలు సాగుతున్నాయని, దీన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని అన్నారు.

More Telugu News