Cow: ఆవును కొట్టాడన్న కోపంతో వ్యక్తి దారుణ హత్య!

  • కాన్పూర్ లో కలకలం రేపిన ఘటన
  • పిల్లలు ఆడుకుంటుంటే వచ్చిన ఆవు
  • కర్రతో మందలించడంతో మొదలైన ఘర్షణ
  • నిందితుడు పరారీలో ఉన్నాడన్న పోలీసులు
Murder in Kanpur For Chasing Cow

తన ఇంటి ముందుకు వచ్చిన ఆవును కొట్టాడన్న ఆగ్రహంతో ఓ వ్యక్తిని అతని భార్యా పిల్లల ముందే దారుణంగా కొట్టి చంపిన ఘటన కాన్పూర్ లో తీవ్ర కలకలం రేపింది. ఇక్కడి గోవింద్ నగర్ పోలీసు స్టేషన్ అధికారి వెల్లడించిన వివరాల ప్రకారం, పట్టణంలోని మహదేవ్ నగర్ బస్తీలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆయుష్ యాదవ్ అనే వ్యక్తికి చెందిన గోవు, రమణ గుప్తా (46) అనే వ్యక్తి ఇంటి ముందుకు వచ్చింది.

ఆ సమయంలో గుప్తా పిల్లలు బయట ఆడుకుంటున్నారు. వారు భయపడుతుండటంతో, ఓ కర్రను తెచ్చిన గుప్తా, దాన్ని అదిలించాడు. ఈ ఘటనను చూసిన ఆయుష్ యాదవ్, రమణ గుప్తాతో గొడవకు దిగాడు. ఆపై కర్ర తీసుకుని వచ్చి దారుణంగా కొట్టాడు. ఈ దాడిలో రమణ గుప్తా తీవ్రంగా గాయపడగా, బంధువులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతని ప్రాణాలు పోయాయని వైద్యులు వెల్లడించగా, విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.

ప్రధాన నిందితుడు ఆయుష్ యాదవ్ తన కుటుంబంతో సహా పరారయ్యాడని, అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. జరిగిన ఘటనపై మృతుడి భార్య స్పందిస్తూ, చిన్న కారణానికే తన భర్తను హత్య చేశారని ఆరోపించారు. గొడవ తరువాత తన భర్తను ఆసుపత్రికి తీసుకుని వెళ్లామని, అప్పటికే మృతి చెందాడని, నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

More Telugu News