TRS: రిటైర్మెంట్ తర్వాత డీజీపీ మహేందర్‌రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకుంటారు: రఘునందన్‌రావు

  • అత్తాపూర్ డివిజన్ అభ్యర్థి విజయోత్సవ ర్యాలీలో రఘునందన్‌రావు
  • బావ, బావమరిది పని అయిపోయిందని ఎద్దేవా
  • నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ ఆంధ్రాలో తేలుతారు
Dubbaka MLA Raghunandan Rao slams Harish Rao and KTR

తెలంగాణ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌లపై దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మరోమారు తీవ్ర విమర్శలు చేశారు. అత్తాపూర్‌ డివిజన్‌లో గెలిచిన బీజేపీ కార్పొరేటర్ మోండ్ర సంగీత విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీ కార్పొరేటర్లు ప్రజలకు సేవకులుగా పనిచేయాలని సూచించారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికలోనూ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నేతలు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.

హరీశ్‌రావును దుబ్బాక ప్రజలు తంతే శంకరగిరి మాన్యాల్లో పడ్డారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో అభివృద్ధి కావాలా? అరాచకం కావాలా? అన్న హరీశ్ బావమరిది కేటీఆర్‌ను హైదరాబాద్ ప్రజలు నేలమీదికి తీసుకొచ్చారని అన్నారు. బావ, బావమరిది పని అయిపోయిందని ఎద్దేవా చేశారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్‌ను అదే సాగర్‌లో ముంచితే ఆంధ్రాలో తేలుతారని అన్నారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వంగివంగి సలాములు చేస్తున్న విషయాన్ని గమనించాలన్నారు. పదవీ విరమణ తర్వాత డీజీపీ మహేందర్‌రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని తీవ్ర విమర్శలు చేశారు.

More Telugu News