farmer: నెల్లూరులోనూ ఏలూరు తరహా ఘటన.. నాట్లు వేస్తుండగా రైతు కూలీలకు అస్వస్థత.. ఒకరి మృతి

  • నెల్లూరులోని కలువాయి మండలం వెలుగొట్టపల్లిలో ఘటన
  • ఆసుపత్రిలో ఆరుగురు రైతు కూలీలకు చికిత్స
  • ముగ్గురి పరిస్థితి విషమం
  • హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుంటోన్న అధికారులు
farmer dies and 5 hospitalized in nellore

పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో వందలాది మంది ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురికావడం కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. కలుషిత తాగునీరు, ఆహారాన్ని తీసుకోవడం వంటి కారణంగానే వారు అస్వస్థతకు గురయ్యారని అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో నెల్లూరు జిల్లాలోని కలువాయి మండలం వెలుగొట్టపల్లిలో రైతు కూలీలు అస్వస్థతకు గురి కావడం మరోసారి కలకలం రేపుతోంది.

ఆరుగురు కూలీలు నాట్లు వేస్తోన్న సమయంలో అస్వస్థతకు గురి కాగా వారిని తాజాగా స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, వారిలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. అంతేగాక, ముగ్గురి పరిస్థితి విషమంగా మారింది. దీంతో ఆ ముగ్గురికి మెరుగైన చికిత్స అందించడం కోసం మరో ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ అధికారులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుంటున్నారు.

అస్వస్థతకు గురైన వారు ఇతర రాష్ట్రం నుంచి వచ్చి, ఇక్కడ కూలీలుగా పని చేస్తున్నారని స్థానికులు చెప్పారు. కలుషితాహారం, నీరు కారణంగానే వారు అస్వస్థతకు గురై వుండచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారు కాలువల ద్వారా వచ్చిన నీటిని తాగారా? లేక పురుగుల మందు కలిసిన నీరు తాగారా? అనే అంశాలపై అధికారులు విచారణ జరుపుతున్నారు.

More Telugu News