Eluru: ఏలూరు ఘటన వ్యాధి కాదు... రియాక్షన్ మాత్రమే: ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్

AP Health and Medical Commissioner reports to CM Jagan over Eluru incident
  • ఏలూరు ఘటనపై సీఎం జగన్ సమీక్ష
  • సీఎంకు వివరాలు తెలిపిన కమిషనర్ భాస్కర్
  • తాగునీటిలో ఏమీలేదని వెల్లడి
  • ఆహారంపై అనుమానాలు మిగిలున్నాయని వివరణ
  • మరో నాలుగు రోజుల్లో స్పష్టత వస్తుందని వ్యాఖ్యలు
సీఎం జగన్ ఏలూరు ఘటనపై నిర్వహించిన సమీక్షలో ఏపీ వైద్య, ఆరోగ్యశాఖ కమిషనర్ భాస్కర్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు నివేదికల ఆధారంగా సీఎంకు ఏలూరు ఘటనపై వివరాలు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో ప్రజలు తీవ్ర అస్వస్థతకు గురికావడానికి కారణం వ్యాధి కాదని, రియాక్షన్ కారణంగానే ప్రజలు ఆసుపత్రుల పాలయ్యారని భావిస్తున్నామని వెల్లడించారు. అయితే ప్రజల ఆరోగ్యం దెబ్బతినడానికి స్పష్టమైన కారణాలు తెలియాల్సి ఉందని అన్నారు.

ఏలూరు ఘటనలో బాధితుల రక్తంలో నికెల్, సీసం ఆనవాళ్లు కనిపించాయని తెలిపారు. తాగునీటిలో ఏ సమస్యా లేదని నివేదికలు చెబుతున్నాయని, ఇక ఆహారంపై అనుమానాలు మిగిలున్నాయని తెలిపారు. ప్రజలు తీసుకునే ఆహారంలో సీసం, నికెల్ ఉండొచ్చని, ఏదైనా పురుగుమందుల అవశేషాలు కలిసినందువల్ల ఇలా జరిగి ఉండొచ్చన్న అనుమానాలు ఉన్నాయని తెలిపారు. గాల్లోనూ ఎలాంటి కాలుష్యం లేదని కాలుష్య నియంత్రణ మండలి నివేదిక వెల్లడిస్తోందని భాస్కర్ వివరించారు. కొన్ని హానికారకాల మూలంగా ప్రజలు రియాక్షన్ కు గురైనట్టు భావిస్తున్నామని తెలిపారు.

అయితే, ప్రజలు రియాక్షన్ కు గురికావడానికి దారితీసిన కారణాలు తెలిసేందుకు మరో నాలుగు రోజుల సమయం పడుతుందని అన్నారు.
Eluru
Health and Medical Commissioner
Andhra Pradesh
Jagan

More Telugu News