TRS: ముగిసిన జీహెచ్ఎంసీ ఓట్ల లెక్కింపు... అతి పెద్ద పార్టీగా టీఆర్ఎస్

  • టీఆర్ఎస్ కు 55 డివిజన్లలో విజయం!
  • 48 డివిజన్లు కైవసం చేసుకున్న బీజేపీ
  • ఎంఐఎంకు 44 సీట్లు
TRS becomes largest single party in GHMC Elections

జీహెచ్ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముగిసింది. మొత్తం 150 డివిజన్లకు గాను ఎన్నికలు నిర్వహించగా, 149 డివిజన్లకు నేడు ఓట్లు లెక్కించారు. నేరేడ్ మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపును పెండింగ్ లో పెట్టారు. అక్కడ స్వస్తిక్ ముద్రతో పడిన ఓట్ల కంటే వేరే ముద్రతో పడిన ఓట్ల మెజారిటీ ఎక్కువగా ఉండడంతో హైకోర్టు ఆదేశాల మేరకు లెక్కింపు నిలిపివేశారు. ఇక, ఫలితాలు చూస్తే,అధికార టీఆర్ఎస్ 55 డివిజన్లలో విజయం సాధించడం ద్వారా అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2016 ఎన్నికలతో పోల్చితే టీఆర్ఎస్ కు ఇవి చేదు ఫలితాలు.

టీఆర్ఎస్ కు గట్టిపోటీ ఇచ్చిన బీజేపీ 48 డివిజన్లు కైవసం చేసుకోవడం ఈసారి ఎన్నికల్లో హైలైట్ అని చెప్పవచ్చు. ఎప్పట్లాగే ఎంఐఎం తన హవా చాటుకుంటూ 44 డివిజన్లలో జయకేతనం ఎగురవేసింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణంగా దెబ్బతిన్నది. హస్తం పార్టీకి కేవలం 2 డివిజన్లలో తప్ప ప్రతిచోటా నిరాదరణే ఎదురైంది.

అసలు విషయానికొస్తే... జీహెచ్ఎంసీలో ఈసారి హంగ్ తప్పదని తేలిపోయింది. మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు మ్యాజిక్ ఫిగర్ 76 సీట్లు కాగా, ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ కూడా ఆ మార్కు చేరుకోలేకపోయింది. దాంతో మేయర్ పదవి కోసం ఎంఐఎం మద్దతు కీలకం కానుంది. బీజేపీ... ఎంఐఎం మద్దతు కోరే అవకాశాలు లేవు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్, ఎంఐఎం కలుస్తాయా అన్నదానిపై ఆసక్తి నెలకొంది.

More Telugu News