తిరుమలలో కుండపోత... విరిగి పడిన భారీ వృక్షాలు, కొండ చరియలు!

Heavy Rains Causes Land Slides in Tirumala
  • క్రమంగా ఏపీ వైపు వస్తున్న నివర్
  • మంగళవారం రాత్రి నుంచి తిరుమలలో వర్షం
  • భారీ బండరాళ్లను తొలగిస్తున్న అధికారులు
  • వివిధ జిల్లాల్లో అధికారుల అప్రమత్తం
తమిళనాడు తీరాన్ని దాటిన నివర్ తుపాను, క్రమంగా ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుండటంతో గత రాత్రి నుంచి చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల పరిధిలో భారీ వర్షం కురుస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. తిరుమలలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న వర్షం కొనసాగుతోంది.

కనుమ దారిలో కొండ చరియలు విరిగి పడ్డాయి. పెను గాలులకు ఎన్నో భారీ వృక్షాలు నేల కూలాయి. హరిణి ప్రాంతంలో భారీ రాళ్లు రోడ్డుపై పడటంతో, విషయం తెలుసుకున్న అధికారులు, వెంటనే స్పందించి జేసీబీలతో వాటిని తొలగించే కార్యక్రమాలను ప్రారంభించారు. పాప వినాశనం వద్ద ఒకే చోట పలు వృక్షాలు కూలాయి. వాటిని తొలగించే పనులు మొదలు పెట్టామని టీటీడీ అధికారులు ప్రకటించారు.

ఇక నివర్ ప్రభావం కర్నూలు, ప్రకాశం, కడప జిల్లాలపైనా కనిపిస్తోంది. గత రాత్రి నుంచి కొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైంది. నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో సహాయక చర్యల కోసం 5 ఎస్డీఆర్ఎఫ్, 4 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను సిద్ధం చేశామని ఏపీ సర్కారు వెల్లడించింది. ప్రజలు తాముంటున్న ఇల్లు సురక్షితం కాదని భావిస్తే, పునరావాస కేంద్రాలకు వెళ్లాలని విపత్తు శాఖ కోరింది. రైతులు తమ పంటలను రక్షించుకునేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
Go Back to Shorts
Nivar
Rain
Tirumala
Land Slides

More Telugu News