KTR: ఆ పని చేయండి.. మోదీని మేము కూడా పొగుడుతాం: కేటీఆర్

  • బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతోంది
  • తెలంగాణకే కాదు ఏపీకి కూడా బీజేపీ చేసిందేమీ లేదు
  • దమ్ముంటే హైదరాబాదుకు లక్ష  కోట్ల ప్యాకేజీ తీసుకురండి
BJP has done nothing to Amaravati also says  KTR

జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా విపక్ష బీజేపీపై టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఓట్ల కోసం బీజేపీ మత రాజకీయాలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. ప్రశాంతంగా ఉన్న హైదరాబాదులో కల్లోలాలు సృష్టించేందుకు బీజేపీ నేతలు యత్నిస్తున్నారని మండిపడ్డారు. ఈరోజు జరిగిన తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలంగాణకే కాదు ఏపీకి కూడా బీజేపీ చేసింది శూన్యమని కేటీఆర్ అన్నారు. ఏపీ రాజధాని అమరావతికి బీజేపీ ఏమీ ఇవ్వలేదని చెప్పారు. అమరావతి శంకుస్థాపన సమయంలో ప్రధాని మోదీ ఎన్నో మాట్లాడారని... చివరకు అమరావతికి నీళ్లు, మట్టి మాత్రమే ఇచ్చారని విమర్శించారు. బీజేపీ నేతలకు దమ్ముంటే హైదరాబాద్ కు లక్ష కోట్ల ప్యాకేజీ తీసుకురావాలని సవాల్ విసిరారు. లక్ష కోట్ల ప్యాకేజీని తీసుకొస్తే మోదీని తాము కూడా ప్రశంసిస్తామని చెప్పారు. బీజేపీ నేతలవి మాటలే తప్ప చేతలు ఉండవని అన్నారు. హైదరాబాదును అన్ని విధాలా అభివృద్ధి చేసిన టీఆర్ఎస్ పక్షానే ప్రజలందరూ ఉన్నారని చెప్పారు.

More Telugu News