BJP: బండి సంజయ్ పై ఆరోపణలతో రాజాసింగ్ ఆడియో వైరల్.. ప్రత్యర్థుల కుట్ర అంటూ ఎమ్మెల్యే ఖండన!

  • తన అనుచరులకు టికెట్లు ఇవ్వలేదంటూ ఆరోపణలు 
  • వైరల్ అవుతున్న రాజాసింగ్ గొంతుతో ఉన్న ఆడియో
  • అది తన గొంతుకాదంటూ ఎమ్మెల్యే వివరణ 
BJP Raja singh clarifies about viral audio

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తనను మోసం చేశారని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తన అనుచరులకు గన్‌ఫౌండ్రీ, బేగంబజార్ టికెట్లు అడిగితే ఇవ్వలేదంటూ బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వాపోయినట్టుగా ఉన్న ఓ ఆడియో వైరల్ అవుతోంది. గోషామహల్ నియోజకవర్గాన్ని తనకు వదిలేయాలని అభ్యర్థించినా ఫలితం లేకుండా పోయిందని, గత ఎన్నికల్లో తన విజయం కోసం శ్రమించిన వ్యక్తికి టికెట్ ఇప్పించుకోలేకపోయానని ఆ ఆడియోలో ఉంది. తన వారికి టికెట్ దక్కకపోవడంతో కార్యకర్తలు అసంతృప్తిగా ఉన్నారని, త్వరలోనే ఈ విషయమై అధిష్ఠానానికి లేఖ రాస్తానని అందులో రాజాసింగ్ పేర్కొన్నారు.

వైరల్ అవుతున్న ఆడియోపై రాజాసింగ్ స్పందించారు. ఆ ఆడియోలో ఉన్నది తన గొంతు కాదని, గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో కావాలనే ఈ దుష్ప్రచారానికి దిగారని అన్నారు. అంతేకాదని, బండి సంజయ్‌ తీరుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నష్టం జరగబోతోందని, ఆయనను తక్షణమే పార్టీ నుంచి తొలగించాలని తన పేరుతో ఓ ట్వీట్‌ను కూడా వైరల్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో పార్టీ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ప్రత్యర్థులు చేస్తున్న కుట్రగా దీనిని అభివర్ణించిన రాజాసింగ్.. దీనిపై సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేస్తానని తెలిపారు.

More Telugu News