Mohammed Siraj: తండ్రిని కోల్పోయిన దుఃఖంలోనూ జట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్న టీమిండియా పేసర్

  • సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ కన్నుమూత
  • ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న సిరాజ్
  • భారత్ వెళ్లాలనుకుంటే పంపిస్తామన్న బీసీసీఐ
  • ఆసీస్ పర్యటనలో కొనసాగుతానని సిరాజ్ వెల్లడి
Mohammed Siraj decides to continue with team despite lost his father

టీమిండియా యువ పేసర్ మహ్మద్ సిరాజ్ కు పితృవియోగం కలిగిన సంగతి తెలిసిందే. సిరాజ్ తండ్రి మహ్మద్ గౌస్ ఊపిరితిత్తుల వ్యాధికి చికిత్స పొందుతూ హైదరాబాదులో ఇటీవల కన్నుమూశారు. ప్రస్తుతం సిరాజ్ టీమిండియాతో ఆస్ట్రేలియాలో పర్యటనలో ఉన్నాడు. తండ్రిని కోల్పోయిన దుఃఖంలో ఉన్న సిరాజ్ ను భారత్ తీసుకువచ్చేందుకు బీసీసీఐ ప్రయత్నించింది.

ఈ కష్టకాలంలో తన కుటుంబంతో ఉండేందుకు సిరాజ్ కు బోర్డు అవకాశమిచ్చింది. స్వదేశానికి వస్తానంటే అందుకు తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపింది. అయితే, సిరాజ్ అంతటి విషాదంలోనూ జట్టుతోనే ఉండాలని నిర్ణయించుకున్నాడు. తాను భారత్ వెళ్లడంలేదని, ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాతో పాటే కొనసాగుతానని చెప్పాడు.

దాంతో అతడి నిర్ణయాన్ని గౌరవిస్తూ బీసీసీఐ గౌరవ కార్యదర్శి జై షా ఓ ప్రకటన చేశారు. ఈ కష్టకాలంలో సిరాజ్ కు బోర్డు అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని ఆ ప్రకటనలో వెల్లడించారు. సిరాజ్, అతడి కుటుంబ ఏకాంతాన్ని మీడియా గౌరవించాలని కోరారు.

More Telugu News