Bandi Sanjay: భారత్ మాతాకీ జై.. వందేమాతరం.. చార్మినార్ వద్ద బీజేపీ శ్రేణుల నినాదాలు.. ఉద్రిక్తత

  • భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న బండి సంజయ్
  • చార్మినార్ వద్ద నెలకొన్న ఉద్రికత్త పరిస్థితులు
  • కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్న సంజయ్
BJP cadre shouts Baharat Mata ki Jai slogans  at Charminar

ఎంఐఎం ప్రభావం ఎక్కువగా ఉండే పాతబస్తీ చార్మినార్ ప్రాంతం వందేమాతరం, భారత్ మాతాకీ జై నినాదాలతో మారుమోగుతోంది. బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసినట్టుగానే మధ్యాహ్నం 12 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయం వద్దకు చేరుకున్నారు. అమ్మవారికి పూజలు నిర్వహించి, ఆలయం చూట్టూ ప్రదక్షిణలు చేశారు. ఆయనతో పాటు పెద్ద సంఖ్యలో బీజేపీ శ్రేణులు చార్మినార్ కు తరలి వచ్చాయి.

ఆలయంలో పూజలు నిర్వహించిన బండి సంజయ్ ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం ఎదురు చూస్తున్నారు. మధ్యాహ్నం 12.45 గంటల వరకు కేసీఆర్ కోసం తాను వేచి చూస్తానని సంజయ్ చెప్పిన సంగతి తెలిసిందే. ఆ డెడ్ లైన్ ముగిసిన తర్వాత బండి సంజయ్ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.

మరోవైపు, చార్మినార్ పక్కనే మసీదు ఉన్న సంగతి తెలిసిందే. ఈ రోజు శుక్రవారం కావడంతో మధ్యాహ్నం ప్రార్థనలకు పెద్ద సంఖ్యలో ముస్లింలు అక్కడకు వస్తారు. ఇదే సమయంలో పెద్ద సంఖ్యలో అక్కడ బీజేపీ శ్రేణులు ఉండటం పోలీసులను కలవరపాటుకు గురి చేస్తోంది. ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు మోహరించారు. ప్రస్తుతం అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

More Telugu News