Karnataka: కర్ణాటకలో వివక్ష: దళితులకు క్షవరం చేసినందుకు రూ.50 వేలు జ‌రిమానా వేసిన గ్రామస్థులు

  • గతంలోనూ పలుసార్లు ఫైన్ 
  • అధికారులకు బార్బర్ ఫిర్యాదు
  • క‌ర్ణాట‌క‌లోని హ‌ల్లేరి గ్రామంలో ఘటన

ఎస్సీ, ఎస్టీ వ‌ర్గాల వారికి క్షవరం చేసినందుకు ఓ సెలూన్ ఓనర్‌కు గ్రామస్థులు  50 వేల రూపాయల జ‌రిమానా విధించారు. ఆయనకు ఇలా జరిమానా విధించడం ఇది కొత్త కాదు. గతంలోనూ ఇలాగే గ్రామపెద్దలు తీర్పు ఇవ్వడం గమనార్హం. తాజాగా ఆ సెలూన్ ఓనర్ ఈ విషయంపై అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.  

క‌ర్ణాట‌క‌లోని మైసూరు జిల్లా  నాన్‌జ‌నుగూడ తాలూకాలోని హ‌ల్లేరి గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  సెలూన్ న‌డుపుతూ జీవిస్తోన్న మ‌ల్లికార్జున్ శెట్టిని ఆ గ్రామ‌స్థులు సామాజికంగానూ వెలి వేసి కలకలం రేపారు. గ‌తంలోనూ వారు ఇలాగే తనకు జరిమానా విధిస్తే తాను చెల్లించిన‌ట్లు మ‌ల్లికార్జున్ శెట్టి చెప్పాడు.

తమ గ్రామంలో ఇప్పటికీ వివక్ష కొనసాగుతోందని, ఎస్సీ, ఎస్టీల‌కు క్షవరం చేసినందుకు గ్రామ‌స్థులు త‌న‌ను వేధిస్తున్నార‌ని తెలిపాడు. గ్రామస్థుల వేధింపుల నుంచి త‌నను కాపాడకపోతే ఆత్మ‌హ‌త్య చేసుకుంటానని చెప్పాడు. తాము చెప్పినా వినకుండా ఎస్సీ, ఎస్టీలకు క్షవరం చేస్తున్నాడంటూ కొందరు అగ్ర కులస్థులు గ్రామ పెద్దలకు ఫిర్యాదు చేయడంతో తమ కుటుంబాన్ని గ్రామ సంఘం బహిష్కరిస్తున్నట్టు గ్రామ పెద్దలు తీర్పు ఇచ్చారని చెప్పాడు.

గతంలో కొంతమందితో కలసి తమ షాపు వద్దకు వచ్చిన చన్నా నాయక్ అనే గ్రామస్థుడు.. ఒకవేళ దళితులకు క్షవరం చేస్తే వారి నుంచి ఎ‍క్కువ డబ్బు వసూలు చేయాలని కూడా ఆదేశించారని ఆరోపించాడు. అప్పట్లో అందుకు తాము అంగీకరించకపోవడంతో తన కుమారుడిని కొట్టారని, అతడిని బెదిరించి రూ.5 వేలు తీసుకున్నారని చెప్పాడు. ఎస్సీ, ఎస్టీలకు క్షవరం చేస్తే నేరమా? అని నిలదీశాడు. తమకు న్యాయం చేయాలని అధికారులను కోరాడు.

More Telugu News