Sensex: మార్కెట్ సెంటిమెంట్ ను పెంచిన బీహార్ ట్రెండ్స్... పడుతూ లేస్తూనే కొత్త రికార్డు!

  • వరుసగా రెండో రోజు రికార్డు
  • 1 శాతం పెరిగిన సూచికలు
  • 43 వేల మార్క్ దాటిన సెన్సెక్స్
Market Sentiment Boosted by Bihar Elections

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయేకు ఎదురుగాలి వీస్తోందంటూ ఉదయం 9.30 గంటలకు తొలి ట్రెండ్స్ వచ్చిన సమయంలో అమ్మకాల ఒత్తిడి కనిపించిన స్టాక్ మార్కెట్ లో, ఆపై సమయం గడిచే కొద్దీ, ఎన్డీయేకు ఆధిక్యం పెరుగుతూ రాగా, మార్కెట్ కూడా అంతే స్థాయిలో పెరుగుతూ వచ్చింది. మరోసారి బీహార్ లో ఎన్డీయే అధికారంలోకి వస్తుందన్న సంకేతాలు 11 గంటల సమయంలో రాగా, సెన్సెక్స్ వరుసగా రెండో రోజు సరికొత్త రికార్డులకు దూసుకెళ్లింది.

ఈ మధ్యాహ్నం 12.15 గంటల సమయంలో సెన్సెక్స్ క్రితం ముగింపుతో పోలిస్తే 442 పాయింట్లు పెరిగి 1 శాతం లాభంతో 43 వేల మార్క్ ను దాటి ముందుకు సాగుతోంది. సెన్సెక్స్ 50 సైతం 0.86 శాతం లాభంతో సాగుతోంది. ఇదే సమయంలో నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ నిఫ్టీ 110.20 పాయింట్లు పెరిగి 0.88 శాతం లాభంతో 12,570 పాయింట్ల వద్ద కదలాడుతోంది.

బజాజ్ ఫైనాన్స్, ఇండస్ ఇండ్ బ్యాంక్, ఎల్ అండ్ టీ, బజాజ్ ఫిన్ సర్వ్, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ తదితర కంపెనీలు లాభాల్లో ఉండగా, టెక్ మహీంద్రా, హెచ్సీఎల్ టెక్, ఇన్ఫోసిస్, నెస్ట్లే ఇండియా, టీసీఎస్, సన్ ఫార్మా తదితర కంపెనీలు నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

More Telugu News