Lambourgini: ఏపీకి రానున్న లాంబోర్గిని... రూ. 1,750 కోట్ల పెట్టుబడి!

  • ఏపీలో బ్యాటరీ వాహనాల తయారీ కేంద్రం
  • ప్రీమియం ఎలక్ట్రికల్ మినీ వాహనాల యూనిట్
  • కైనటిక్ గ్రీన్ తో డీల్ కుదుర్చుకుని వస్తున్న లాంబోర్గిని
Lambourgini is Intrested to Come to AP

ప్రపంచవ్యాప్తంగా స్పోర్ట్స్ వాహనాలను మార్కెటింగ్ చేస్తున్న లాంబోర్గిని, ఆంధ్రప్రదేశ్ లో మాన్యుఫాక్చరింగ్ ప్లాంటును నిర్మించేందుకు ముందుకు వచ్చింది. గోల్ఫ్, హాస్పిటాలిటీ రంగాల్లో వినియోగించే ప్రీమియమ్ బ్రాండ్ ఎలక్ట్రికల్ మినీ వాహనాలను తయారు చేసే యూనిట్ ను రాష్ట్రంలో ఏర్పాటు చేయాలని సంస్థ భావిస్తోంది. ఇందుకోసం రూ. 1,750 కోట్ల పెట్టుబడిని పెట్టనున్నట్టు తెలుస్తోంది.

కాగా, ఇండియాలో ప్రీమియం ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసేందుకు 2018లో కైనటిక్ గ్రీన్ తో లాంబోర్గినీ డీల్ కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. ఆపై కైనటిక్ గ్రీన్ బోర్డు ఆమోదం తెలపడంతో, ఏపీలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ యూనిట్ తో పాటు చార్జింగ్ స్టేషన్లు, రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ యూనిట్లను సంస్థ నెలకొల్పనుంది.

ఈ మేరకు ఏపీ పరిశ్రమల మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి, కైనటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్ లిమిటెడ్ వ్యవస్థాపక సీఈఓ సులజ్జా ఫిరోడియా నుంచి లేఖ వచ్చింది. పోర్టు ఆధారిత సెజ్ ప్రాంతంలో తమకు 50 ఎకరాల స్థలం ఇస్తే, యూనిట్ ను ఏర్పాటు చేస్తామని ఆ సంస్థ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఇదే సమయంలో టూ వీలర్, త్రీ వీలర్ వాహనాల తయారీకి అవసరమయ్యేలా మరింత స్థలం ఇస్తే, ఎక్స్ పోర్ట్ యూనిట్ నూ ఏర్పాటు చేస్తామని తెలిపింది.

రానున్న పదేళ్లలో ఏపీలో 5 లక్షల బ్యాటరీ వాహనాల విక్రయం తమ లక్ష్యమని, దీని ద్వారా, 2.30 కోట్ల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలు తగ్గుతాయని, తత్ఫలితంగా 147 కోట్లకు పైగా చెట్లను పెంచినంత సమానమని పేర్కొంది. దీన్ని మెగా ప్రాజెక్టుగా పరిగణించి, రాయితీలను ఇవ్వాలని కోరింది.

More Telugu News