Congress: బీహార్ కాంగ్రెస్ కార్యాలయంపై ఐటీ దాడులు!

  • ఆదాయపు పన్ను శాఖ దాడులతో కలకలం
  • పార్క్ చేసిన కారులో రూ.8.5 లక్షలు
  • పార్టీకి సంబంధం లేదన్న కాంగ్రెస్
IT Raids on Bihar Congress Office

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ, రాష్ట్ర కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరపడం రాజకీయ కలకలాన్ని రేపింది. దాడులకు వచ్చిన అధికారులు, పార్క్ చేసివున్న ఓ కారు నుంచి రూ. 8.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ కారు కాంగ్రెస్ నేత అశుతోశ్ కు చెందినదిగా గుర్తించి, ఆయన్ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

అయితే, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాత్రం అధికారులకు ఎటువంటి డబ్బూ పట్టుబడలేదు. ఆ సమయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు శక్తి సింగ్ గోహిల్, నేషనల్ మీడియా ఇన్ చార్జ్ రణ్ దీప్ సుర్జేవాలా ఉన్నారు. వీరిద్దరినీ అధికారులు ప్రశ్నించారు. తమకు అందిన సమాచారంతోనే దాడులకు వచ్చామని ఐటీ అధికారులు వెల్లడించగా, ఇది రాజకీయ కుట్రని కాంగ్రెస్ మండిపడింది.

త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ - జేడీయూ కూటమి ఓడిపోవడం ఖాయమని వ్యాఖ్యానించిన శక్తి సింగ్ గోహిల్, అందువల్లే తమ పార్టీ కార్యాలయంపై ఐటీ దాడులకు అధికారులను పంపారని ఆరోపించారు. దొరికిన డబ్బున్న కారుతో కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధమూ లేదని స్పష్టం చేశారు.

More Telugu News