BJP: బీజేపీ బీహార్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల.. రాష్ట్ర ప్రజలకు ఉచితంగా కరోనా వ్యాక్సిన్ వేస్తామంటూ హామీ!

  • బీహార్‌లో 19 లక్షల ఉద్యోగాల కల్పన
  • మరో 3 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ
  • రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా తయారు చేస్తాం
  • 30 లక్షల మందికి పక్కా ఇళ్లు
BJP Promises Free Covid Vaccination In Bihar Manifesto

బీహార్‌లోని 243 శాసనసభ స్థానాలకు ఈ నెల 28న తొలిదశ, నవంబరు 3, 7 తేదీల్లో రెండో, మూడో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల ఫలితాలను నవంబరు 10న విడుదల చేస్తారు. ఎన్నికల నేపథ్యంలో‌ బీజేపీ తమ మేనిఫెస్టోను విడుదల చేసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆర్జేడీ ఇచ్చిన హామీలను మించిన హామీలను గుప్పిస్తూ బీజేపీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేసింది.

ఈ మేనిఫెస్టోను రాష్ట్ర బీజేపీ నేతల సమక్షంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విడుదల చేశారు బీహార్‌లో కరోనా వ్యాక్సిన్‌ని అందరికీ ఉచితంగా ఇస్తామని కూడా మేనిఫెస్టోలో పేర్కొనడం గమనార్హం.  తమ ప్రభుత్వ పాలనలో బీహార్లో 15 ఏళ్లలో జీడీపీ 3 శాతం నుంచి 11.3 శాతానికి పెరిగిందని నిర్మలా సీతారామన్ తెలిపారు.  

బీహార్‌లో ప్ర‌తి ఒక్కరికీ ఉచితంగా కరోనా టీకా ఇస్తామన్నది ఈ ఎన్నిక‌ల మేనిఫెస్టోలో తాము ఇస్తోన్న తొలి హామీ అని అన్నారు. ఎన్డీఏను రాష్ట్రప్రజలు గెలిపించాల‌ని అన్నారు. బీహార్‌లో మ‌రో 5 సంవత్సరాల పాటు నితీశ్ కుమార్ సీఎంగా ఉంటార‌ని ఆమె ధీమా వ్యక్తం చేశారు. నితీశ్ పాల‌న‌లోనే బీహార్ ఉత్త‌మ రాష్ట్రంగా అభివృద్ధి చెందుతుంద‌ని చెప్పుకొచ్చారు.

బీహార్‌లో 19 లక్షల ఉద్యోగాల కల్పన, మరో 3 లక్షల ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీ, రాష్ట్రాన్ని ఐటీ హబ్‌గా తయారు చేయడం, 30 లక్షల మందికి పక్కా ఇళ్లు, 9వ తరగతి నుంచి విద్యార్థులకు ఉచితంగా ట్యాబ్లెట్లు వంటి అంశాలను బీజేపీ తమ మేనిఫెస్టోలో చేర్చింది.

More Telugu News