Nairuti: ఆసక్తికర వాస్తవం... ఇంత భారీ వర్షానికి లాక్ డౌన్ కూడా కారణమే!

  • వేసవి అంతా దేశవ్యాప్త లాక్ డౌన్
  • కాలుష్యం తగ్గిపోయి గాలిలో స్వచ్ఛత, తేమ
  • నైరుతిని అడ్డుకుంటున్న అల్పపీడనాలు
  • నైరుతి నిష్క్రమణపై ఇప్పుడే అంచనాకు రాలేమంటున్న శాస్త్రవేత్తలు
Corona Is also a Reason for Heavy Rains

అక్టోబర్ వచ్చిందంటే, వర్షాకాలం ముగిసినట్టే. అయినా చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ కాలంలో ఇంత భారీ వర్షాలేంటన్న ప్రశ్న ప్రతి ఒక్కరిలోనూ మెదలుతున్న వేళ, వాతావరణ కేంద్రాలతో పాటు శాస్త్రవేత్తలు, అధ్యయనాలు చేసి ఓ అంచనాకు వచ్చారు.

ఇంతటి భారీ వర్షాలకు కరోనా కూడా కారణమేనని అభిప్రాయపడుతున్నారు. ఈ వేసవికాలమంతా... అంటే, మార్చి మూడవ వారం నుంచి జూలై వరకూ దేశవ్యాప్తంగా సంపూర్ణంగా లాక్ డౌన్ అమలైందని గుర్తు చేసిన శాస్త్రవేత్తలు, ఈ సమయంలో కాలుష్యం కనిష్ఠానికి పడిపోయిందని, ఫలితంగా గాలిలో స్వచ్ఛత ఏర్పడి, తేమ శాతం పెరిగిందని స్పష్టం చేశారు.

వాతావరణంలో ఏర్పడిన అనూహ్య మార్పు, మరిన్ని వర్షాలకు దారితీసిందని, దీనికితోడు వరుసగా ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా, నైరుతీ రుతుపవనాలు వెనక్కు మళ్లడం ఆలస్యమైందని, ఇదే సమయంలో పసిఫిక్ మహా సముద్రంలో ఏర్పడే ఎల్ నినో ప్రభావం భారత ఉపఖండంపై ఏ మాత్రమూ కనిపించలేదని వెల్లడించారు. ఈ కారణంతోనే వర్షాలు అధికంగా కురుస్తున్నాయని తెలిపారు.

గడచిన 11 సంవత్సరాల్లో 2018లో మాత్రమే నైరుతీ రుతుపవనాలు అత్యంత ఆలస్యంగా సెప్టెంబర్ 29న నిష్క్రమణను ప్రారంభించాయని, ఈ సంవత్సరం సెప్టెంబర్ 28నే అవి వెనక్కు మళ్లాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాస్తవానికి ఆ రోజుతో వర్షాకాలం ముగింపు మొదలైనట్టే. ఇదే సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా వస్తున్న తేమగాలులు, మధ్యప్రదేశ్ పై ఉన్న రుతుపవనాలకు అడ్డుగా నిలిచి, వాటిని ఎటూ కదలకుండా ఆపివేశాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో నైరుతి పవనాలు తెలంగాణ నుంచి ఎప్పుడు వెళ్లిపోతాయన్న విషయాన్ని ఇప్పటికిప్పుడు చెప్పలేమని, బంగాళాఖాతంలో ప్రశాంతత ఏర్పడితేనే అవి పూర్తిగా వెనుదిరుగుతాయని అంచనా వేశారు. కనీసం మరో నాలుగైదు రోజుల పాటు రుతుపవనాల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉండి తీరుతుందని, ఆ తరువాతే వర్షాలు తగ్గేందుకు అవకాశం ఉంటుందని వాతావరణ శాస్త్రవేత్తలు అంటున్నారు.

More Telugu News