Soumya Swaminathan: ఆరోగ్యంగా ఉన్న యువత కరోనా వ్యాక్సిన్ కోసం 2022 వరకు వేచివుండాల్సిందే: డబ్ల్యూహెచ్ఓ

WHO Chief Scientist Soumya Swaminathan says no corona vaccine for healthy youth in next two years
  • మొదట వైద్య సిబ్బందికి వ్యాక్సిన్ ఇవ్వాలన్న డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్
  • యువత 2022 వరకు ఆగాల్సిందేనని వెల్లడి
  • 2021 నాటికి కరోనా వ్యాక్సిన్ రావొచ్చని వ్యాఖ్యలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ కరోనా నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మొదట ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఆమె స్పందించారు. కరోనాపై ముందుండి పోరాడుతున్న వైద్య, ఆరోగ్య సిబ్బందికి, అత్యధిక ముప్పు ఉన్నవారికి,  వయసు మీదపడిన వారికి ఇవ్వాలని తెలిపారు.

ఆరోగ్యంగా ఉన్న యువతకు ఇప్పట్లో కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాకపోవచ్చని, ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని యువతీయువకులు 2022 వరకు వేచి చూడాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాక్సిన్ ఎవరికి ఇవ్వాలన్న దానిపై ఎన్నో సూచనలు వస్తున్నాయని వెల్లడించారు. దీనిపై డబ్ల్యూహెచ్ఓ కసరత్తులు చేస్తోందని వివరించారు.

అత్యంత సమర్థవంతమైన, సురక్షితమైన వ్యాక్సిన్ 2021 నాటికి కనీసం ఒక్కటైనా వస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు. అయితే, కరోనా వ్యాక్సిన్ డోసులు పరిమిత సంఖ్యలోనే లభ్యం కావొచ్చని సౌమ్య స్వామినాథన్ పేర్కొన్నారు.
Soumya Swaminathan
WHO
Corona Virus
Vaccine
Youth

More Telugu News