Odisha: దంపతుల మధ్య గొడవలు.. కుమారుడిని అమ్మేసి ఎవరి దారిన వారు వెళ్లిపోయిన భార్యాభర్తలు!

  • ఒడిశాలోని మల్కనగిరి జిల్లాలో ఘటన
  • బాలుడిని చిత్రహింసలు పెట్టిన కొనుగోలు చేసిన కుటుంబం
  • పారిపోయి మరో గ్రామానికి చేరుకున్న బాధిత చిన్నారి
parents sell off their son to separate

ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య పొడసూపిన విభేదాలు సమసిపోయి తిరిగి సంతోషంగా జీవితాన్ని గడుపుతామన్న ఆశ లేకపోవడంతో విడిపోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, దంపతులకు ఉన్న ఏకైక కుమారుడు అడ్డుగా మారాడు. దీంతో ఏం చేయాలో పాలుపోని దంపతులు అతడిని విక్రయించి ఎవరికి వారు చెరోదారి చూసుకున్నారు. మథిలి మండలం కియాంగ్ పంచాయతీ పరిధిలోని తేలగబేజా గ్రామంలో జరిగిన ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

తొమ్మిదేళ్ల బాలుడు వాసుదేవ్‌ను కొనుక్కున్న అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబం అతడిని పశువుల కాపలాకు పంపించేది. వెళ్లనని మారాం చేస్తే ఇష్టం వచ్చినట్టు కొడుతుండే వారు. అంతేకాదు, భోజనం కూడా సరిగా పెట్టేవారు కాదు. వారి చిత్రహింసలు రోజురోజుకు మరింత పెరగడంతో భరించలేకపోయిన బాలుడు అక్కడి నుంచి తప్పించుకుని సలపదర్ అనే గ్రామానికి చేరుకున్నాడు.

వాసుదేవ్ కథ విన్న గ్రామస్థులు అతడిని తీసుకెళ్లి అంగన్‌వాడీ కేంద్రానికి అప్పగించారు. బాలుడి గురించి పూర్తి వివరాలు తెలుసుకున్న అంగన్‌వాడీ కార్యకర్త జయంతి వాసుదేవ్‌ను తన ఇంటికి తీసుకెళ్లింది. అయితే, విషయం తెలిసిన బాలుడిని కొనుగోలు చేసిన కుటుంబం అతడిని విడిచిపెట్టాలంటూ జయంతికి ఫోన్ చేసి బెదిరించింది.

దీంతో ఆమె ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన అధికారులు బాలుడి ఇష్ట ప్రకారమే ముందుకు వెళ్తామని, అతడు తన తల్లిదండ్రుల వద్దకు వెళ్తామంటే పంపిస్తామని, లేదంటే చదువుకుంటానంటే చదివిస్తామని తెలిపారు. కాగా, బాలుడిని కొనుగోలు చేసిన కుటుంబంపై పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకున్నదీ తెలియరాలేదు.

More Telugu News