Telangana: వానాకాలం పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది.. రైతులు తొందరపడొద్దు: కేసీఆర్

  • మొత్తం 6 వేల కేంద్రాల ద్వారా ధాన్యాన్ని కొంటాం 
  • రైతులు తాలు, పొల్లు లేని ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలి  
  • ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేస్తాం
CM KCR says govt will bought crop

వానాకాలంలో రైతులు సాగుచేసిన వరి, పత్తి పంటలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, రైతులు తొందరపడి తక్కువ ధరకు అమ్ముకోవద్దని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులను కోరారు. ప్రగతి భవన్‌లో అధికారులతో నిర్వహించిన సమీక్షలో కేసీఆర్ మాట్లాడుతూ.. రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పంటను కొనుగోలు చేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 6 వేల కేంద్రాల ద్వారా వరిని కొనుగోలు చేస్తామన్నారు.

తాలు, పొల్లు లేకుండా ధాన్యం తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని రైతులకు సూచించారు. వానాకాలంలో రైతులు రికార్డు స్థాయిలో 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగుచేశారని, వీటిలో 52.77 లక్షల ఎకరాల్లో వరి, 60.36 లక్షల ఎకరాల్లో పత్తి, 10.78 లక్షల ఎకరాల్లో కందిపంటను సాగుచేసినట్టు కేసీఆర్ తెలిపారు. ధాన్యం కొనుగోళ్లపై ఒకటి రెండు రోజుల్లో మార్గదర్శకాలు జారీ చేస్తామని ముఖ్యమంత్రి వివరించారు.

More Telugu News