Raghunandan Rao: దుబ్బాక ఉప ఎన్నిక: బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు?

Raghunandan Raos name is in consideration for Dubbaka bipolls says Jitender Reddy
  • రఘునందన్ పేరు పరిశీలనలో ఉందన్న జితేందర్ రెడ్డి
  • ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించిన రఘునందన్
  • నియోజకవర్గంపై పూర్తిగా దృష్టి సారించిన హరీశ్ రావు
దుబ్బాక ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణలో రాజకీయం వేడెక్కింది. రాష్ట్రంలోని ప్రముఖ పార్టీలన్నీ ఈ స్థానాన్ని కైవసం చేసుకుని, తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాయి. తమ అభ్యర్థిని ఖరారు చేసే పనిలో పడ్డాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నేత జితేందర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థిగా రఘునందన్ రావు పేరు పరిశీలనలో ఉందని ఆయన తెలిపారు. పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు రాగానే అభ్యర్థి పేరును అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు. దుబ్బాకలో బీజేపీకి ప్రజాదరణ బాగుందని... తాము గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపారు.

మరోవైపు ఇప్పటికే రఘునందన్ రావు స్థానిక బీజేపీ నేతలతో కలిసి ప్రచారాన్ని ప్రారంభించారు. మరోవైపు ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు టీఆర్ఎస్ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ఎమ్మెల్యే రామలింగారెడ్డి మరణం తర్వాత మంత్రి హరీశ్ రావు ఈ నియోజకవర్గంపై పూర్తిగా దృష్టిని సారించారు. టీఆర్ఎస్ నే గెలిపిస్తామంటూ పలు గ్రామాల ప్రజలు కూడా ఏకగ్రీవంగా తీర్మానాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ దే గెలుపని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రామలింగారెడ్డి భార్యకే పార్టీ టికెట్ దక్కే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం.

More Telugu News

Raghunandan Rao
Jitender Reddy
BJP
Harish Rao
TRS
Dubbaka