Sabbam Hari: నీవేమైనా రౌడీ ననుకుంటున్నావా?: సబ్బం హరికి మంత్రి అవంతి వార్నింగ్

  • సబ్బం హరి ఇంటి ప్రహరీ కూల్చివేతపై వివాదం
  • వైసీపీపై మండిపడ్డ సబ్బం హరి
  • వీధి రౌడీలా మాట్లాడారన్న అవంతి
Avanthi Srinivas warns Sabbam Hari

తన ఇంటి ప్రహరీ గోడను అక్రమంగా కూల్చేశారంటూ జీవీఎంసీ అధికారులు, వైసీపీ నేతలపై మాజీ ఎంపీ సబ్బం హరి ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తానేంటో చూపిస్తానంటూ వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైజాగ్ కు చెందిన వైసీపీ మంత్రి అవంతి శ్రీనివాస్ స్పందిస్తూ... సబ్భం హరిపై మండిపడ్డారు.

నీవేమైనా రౌడీ అనుకుంటున్నావా? నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడు అంటూ అవంతి వార్నింగ్ ఇచ్చారు. వీధి రౌడీలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జీవీఎంసీ సిబ్బందిని దుర్భాషలాడారని అన్నారు. ఆక్రమణలను కూల్చితే కక్షసాధింపులంటున్నారని... కక్షసాధింపులకు దిగాల్సిన అవసరం తమకు లేదని చెప్పారు.

పార్కు స్థలం కబ్జా చేసి ఇల్లు కట్టారని ఫిర్యాదు వచ్చిందని.. నోటీసులు ఇచ్చే జీవీఎంసీ అధికారులు ఆక్రమణలను తొలగించారని అవంతి అన్నారు. రూ. 3 కోట్ల విలువైన స్థలాన్ని ఆక్రమించారని చెప్పారు. స్థలాన్ని ఆక్రమిస్తే విడిచిపెట్టాలా? అని ప్రశ్నించారు. వీధి రౌడీలా బూతులు మాట్లాడారని అన్నారు.

More Telugu News