Hyderabad: తెలంగాణలో ప్రారంభమైన పర్యాటకం.. హుస్సేన్ సాగర్‌లో మొదలైన బోటింగ్

  • తెలంగాణ వ్యాప్తంగా తెరుచుకున్న పర్యాటక ప్రదేశాలు
  • నేటి నుంచి నాగార్జున సాగర్‌లో లాంచీ ప్రయాణం ప్రారంభం
  • దుర్గం చెరువు, జలాశయాల వద్ద బోటింగ్ త్వరలో ప్రారంభం
tourist spots reopened in Telangana

కరోనా కోరల నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న తెలంగాణ ప్రజలు మళ్లీ విహార యాత్రలకు క్యూకడుతున్నారు. హైదరాబాద్‌లోని పలు పర్యాటక ప్రదేశాలు నిన్న తెరుచుకున్నాయి. సుదీర్ఘ కాలం తర్వాత మళ్లీ హైదరాబాద్ వాసులు ఉత్సాహంగా పర్యాటక ప్రదేశాలకు వస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను పాటిస్తూ నిన్న తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని పర్యాటక కేంద్రాలు, క్రీడా మైదానాలు, పురావస్తు, చిత్ర ప్రదర్శనశాలలు, చారిత్రక ప్రదేశాలు తెరుచుకున్నాయి. హైదరాబాద్ హుస్సేన్ సాగర్‌లో బోటింగ్ ప్రారంభమైంది. పర్యాటక శాఖ బస్సులకు బుకింగ్ కూడా ప్రారంభమైంది. శిల్పారామం నేడు తెరుచుకోనుంది. ఆరు నెలల తర్వాత హుస్సేన్ సాగర్‌లో బోటింగ్ ప్రారంభం కావడంతో సందర్శకులు బోటింగ్‌కు ఎగబడ్డారు.

ఇక, పర్యాటక ప్రదేశాల వద్ద శానిటైజర్లు, థర్మల్ స్కానర్లు ఏర్పాటు చేశారు. మాస్కులు ధరించిన వారినే లోపలికి అనుమతిస్తున్నారు. ఒకటి, రెండు రోజుల్లో పూర్తిస్థాయిలో పర్యాటక కేంద్రాలను తిరిగి తెరుస్తామని, దుర్గం చెరువుతోపాటు పర్యాటక జలాశయాల వద్ద బోటింగ్‌ను ప్రారంభిస్తామని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. నేటి నుంచి నాగార్జున సాగర్‌లో లాంచీ ప్రయాణాలు ప్రారంభం కానున్నాయి.

More Telugu News