China: కొవిడ్ ఎఫెక్ట్.. ‘ప్రతీకార పర్యాటకం’తో ఆర్థిక వ్యవస్థను నిలబెట్టేందుకు చైనా యత్నం!

  • కరోనా కారణంగా ఏడాదిపాటు ఇంటికే పరిమితమైన ప్రజలు
  • 71వ ప్రజా రిపబ్లిక్ ఆవిర్భావ దినోత్సవంగా 8 రోజుల సెలవులు
  • ప్రయాణ ఆంక్షలు సడలించడంతో పోటెత్తుతున్న ప్రయాణికులు
China encouraging revenge tourism

కరోనా మహమ్మారి కారణంగా దాదాపు ఏడాది పాటు ఇంటికే పరిమితమైన చైనా ప్రజలు ఇప్పుడు ప్రతీకారం తీర్చుకుంటున్నారు. తమ జీవితాలను అతలాకుతలం చేసిన కరోనాపై తమకున్న పగను ‘ప్రతీకార పర్యాటకం’తో తీర్చుకుంటున్నారు.

71వ ప్రజా రిపబ్లిక్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రభుత్వం ఎనిమిది రోజులపాటు అధికారిక సెలవులు ప్రకటించింది. దీనికి తోడు శరద్ రుతువులో జరపుకునే పండగ కూడా అదే సమయంలో రావడంతో ప్రజలు విహార యాత్రలకు సిద్ధమవుతున్నారు. ప్రయాణాలపై ఉన్న ఆంక్షలను సడలించడంతో ప్రజల ఆనందానికి పట్టపగ్గాలేకుండా పోయింది. దీంతో నచ్చిన ప్రదేశాలకు పిల్లాపాపలతో కలిసి పయనమవుతున్నారు.  

ప్రభుత్వం ఈ విహార యాత్రలను ‘ప్రతీకార పర్యాటకం’ (రివేంజ్ టూరిజం), ‘ప్రతీకార యాత్ర’ (రివేంజ్ టూర్)గా అభివర్ణించింది. ఈ 8 సెలవు దినాల్లో పర్యాటకులు పోటెత్తుతారని, దాదాపు 550 మిలియన్ల మంది పర్యటిస్తారని అంచనా వేసింది. ప్రభుత్వ అంచనా నిజమైంది. పర్యాటకులతో టూరిస్ట్ ప్రదేశాలు పోటెత్తాయి. రైళ్లు, బస్సులు కిక్కిరిసిపోయాయి. పర్యాటక ప్రదేశాల్లోని హోటళ్లు పూర్తిగా బుక్ అయిపోయాయి. ఇక పర్యాటకుల వాహనాలతో రోడ్లు నిండిపోయి ఎక్కడికక్కడ జామయ్యాయి. ప్రముఖ పర్యాటక ప్రదేశాలైన యునాన్ ప్రావిన్స్‌లోని దాలి, లిజియాంగ్‌తోపాటు హైనాన్‌లోని సన్యా, దక్షిణ చైనాలోని దీవిలోని హోటల్ బుకింగ్స్ రెండింతలైనట్టు ట్రావెల్ బుకింగ్ సైట్ కునార్ పేర్కొంది.

మరోవైపు, ఈ ప్రతీకార పర్యాటకాన్ని సొమ్ము చేసుకునేందుకు ట్రావెల్ సైట్లు రంగంలోకి దిగాయి. పోటాపోటీగా ఆఫర్ల వాన కురిపిస్తున్నాయి. ప్రయాణికుల డిమాండ్‌కు తగ్గట్టుగా విమానయాన సంస్థలు కొత్త రూట్లను ఆఫర్ చేస్తున్నాయి. 500కు పైగా పర్యాటక ప్రదేశాల్లో పర్యాటకులకు ఉచిత అడ్మిషన్, డిస్కౌంట్లు ప్రకటించాయి. నిజానికి గోల్డెన్ వీక్‌గా పిలిచే ఈ వార్షిక సెలవు దినాల్లో చైనీయులు ఎక్కువగా పర్యటనల్లోనే గడుపుతుంటారు. కరోనా కారణంగా కుప్పకూలిన ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిలో పెట్టేందుకు ఈ ప్రతీకార పర్యాటకం తోడ్పడుతుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

More Telugu News