Vikarabad District: వికారాబాద్ కిడ్నాప్ కథ సుఖాంతం.. భర్తతో కలిసి వెళ్లానన్న యువతి

  • 27న కిడ్నాప్‌ అయిన దీపిక
  • తననెవరూ కిడ్నాప్ చేయలేదన్న యువతి
  • కోర్టులో చెప్పేదానిని బట్టి చర్యలు ఉంటాయన్న పోలీసులు
police successfully chased vikarabad kidnap case

వికారాబాద్ యువతి దీపిక కిడ్నాప్ కేసులో 48 గంటల ఉత్కంఠకు తెరపడింది. భర్తతో కలిసి ఉండేందుకే యువతి అతడితో వెళ్లినట్టు పోలీసులు తేల్చారు. నిన్న వారిద్దరినీ విలేకరుల ఎదుట ప్రవేశపెట్టిన పోలీసులు కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఖలీల్ అలియాస్ అఖిల్‌ను ప్రేమించిన దీపిక నాలుగేళ్ల క్రితం కుటుంబ సభ్యులకు తెలియకుండా వివాహం చేసుకుంది. ఈ పెళ్లి ఇష్టంలేని దీపిక తల్లిదండ్రులు కుమార్తెను ఇంటికి తీసుకొచ్చి ఆమెతో విడాకులకు దరఖాస్తు చేయించారు.

ప్రస్తుతం కేసు విచారణలో ఉండగా, ఈ నెల 27న సాయంత్రం పట్టణంలోని ఎమ్మార్పీ చౌరస్తా సమీపంలో దీపిక కిడ్నాప్ అయింది. ఆమె కోసం గాలించినప్పటికీ ఫలితం లేకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆరు బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో తననెవరూ కిడ్నాప్ చేయలేదని, కావాలనే భర్తతో కలిసి కారులో వెళ్లినట్టు దీపిక పేర్కొందని పోలీసులు తెలిపారు. కోర్టులో దీపిక చెప్పే దానిని బట్టి తదుపరి చర్యలు ఉంటాయని పోలీసులు తెలిపారు.

More Telugu News