Yesudas: బాలును చివరి చూపు చూసుకోలేకపోయాను: ఏసుదాసు ఆవేదన

  • కరోనా వల్ల ఇండియాకు రావడానికి అనుమతి ఇవ్వడం లేదు
  • బాలు సొంత సోదరుడి కంటే ఎక్కువ
  • గత జన్మలో మేమిద్దరం సోదరులనుకుంటా
Yesudas pays tributes to SP Balu

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతి పట్ల ప్రముఖ గాయకుడు ఏసుదాసు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. బాలును చివరి సారి చూసుకోలేకపోయానని తన బాధను వ్యక్తం చేశారు. కరోనా నేపథ్యంలో అమెరికా నుంచి భారత్ కు రావడానికి అనుమతి ఇవ్వడం లేదని, బాలు కడచూపుకు నోచుకోలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. బాలు ఎప్పటికీ తన జ్ఞాపకాల్లో ఉంటారని చెప్పారు.

బాలు తన సొంత సోదరుడికంటే ఎక్కువని చెప్పారు. ఎన్నో ఏళ్లు బాలుతో కలిసి ప్రయాణం చేశానని... తనతో పని చేసిన అందరి కంటే బాలునే తనకు ఎక్కువని అన్నారు. సంగీతాన్ని సాంప్రదాయబద్దంగా నేర్చుకోకపోయినా ఈ రంగంలో ఎంతో నైపుణ్యాన్ని సొంతం చేసుకున్నారని కొనియాడారు. పాడటమే కాకుండా, సంగీతాన్ని చక్కగా కంపోజ్ చేస్తారని అన్నారు. సంగీతంలో శిక్షణ పొందిన వారు కూడా ఇంత గొప్పగా పాడలేరని అన్నారు. తామిద్దరం గత జన్మలో సోదరులమనుకుంటానని చెప్పారు. బాలు ఎవరినీ బాధించలేదని, అందరినీ ప్రేమతో పలకరించేవారని అన్నారు.

More Telugu News