Rajnath Singh: యుద్ధం ప్రారంభించడం మన చేతుల్లోనే ఉంది... అది ఎక్కడ ముగుస్తుందన్నది మాత్రం మన చేతుల్లో లేదు!: రాజ్ నాథ్ సింగ్

  • మన సైన్యం గస్తీకి వెళ్లి తీరుతుంది
  • అడ్డుకునే శక్తి ఈ భువిపై ఎవరికీ లేదు
  • చైనాతో లడాయికి దిగాల్సి వస్తోంది
  • దేశం తలదించుకునే పరిస్థితిని రానివ్వం 
Starting a War is in our Hands but Where that Ends is not Says Rajnath

సరిహద్దుల్లో పెట్రోలింగ్ చేయకుండా భారత సైన్యాన్ని ఈ భూమిపై ఉన్న ఏ శక్తీ అడ్డుకోలేదని, దేశ రక్షణ వారి నరనరాల్లో జీర్ణించుకుపోయిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వ్యాఖ్యానించారు. చైనాతో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను ఎంపీలకు వివరించిన ఆయన, సంప్రదాయ భారత పోస్టుల నుంచి పెట్రోలింగ్ కు వెళుతున్న భారత జవాన్లను అడ్డుకునేందుకు చైనా ప్రయత్నిస్తోందని ఆయన అన్నారు. "ఈ కారణంతోనే చైనాతో మనం 'లడాయి'కి దిగాల్సి వస్తోంది" అని వ్యాఖ్యానించారు.

నిన్న రాజ్యసభలో ఓ ప్రకటన చేసిన ఆయన, తన ప్రసంగ పాఠంలో లేని 'యుద్ధ్' అన్న పదాన్ని వాడి సంచలనానికి తెరలేపారు. "ఓ యుద్ధాన్ని ప్రారంభించడం మన చేతుల్లోనే ఉంది. కానీ, దాని ముగింపు ఎక్కడ అన్నది మాత్రం మన చేతుల్లో లేదు" అని రాజ్ నాథ్ వ్యాఖ్యానించారు. శాంతిని మాత్రమే భారత్ కోరుకుంటుందని వెల్లడించిన ఆయన, "ఇకపై భారత వైఖరి విభిన్నంగా ఉండబోతోంది. దేశంలోని 130 కోట్ల మందికి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నాను. మన దేశం తలదించుకునే పరిస్థితిని మాత్రం తేబోము. ఇదే సమయంలో మరెవరి ముందూ తలవంచబోము, మరెవరో మన ముందు తల వంచాలని భావించడమూ లేదు" అని అన్నారు.

More Telugu News