India: చైనా సైనికుల కొత్త పన్నాగం... లౌడ్ స్పీకర్లలో పంజాబీ పాటలు, హిందీలో హెచ్చరికలు!

  • మంచు కొండల్లో ఎత్తయిన ప్రాంతంలో భారత జవాన్లు
  • మరింత ఎత్తయిన ప్రాంతాలకు వెళ్లేందుకు చూస్తున్న చైనా
  • భారత సైనికులను రెచ్చగొడుతున్నా, సంయమనంతో ఉన్నాం
  • మన జవాన్ల మానసిక స్థైర్యం గట్టిదన్న ఆర్మీ అధికారి
Chaina Army New Plan Over Indian Soldiers

చైనా సరిహద్దుల్లో వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి, భారీ ఎత్తున ఆయుధాలతో ఉన్న రెండుదేశాల సైన్యాల మధ్య తరచూ గాల్లోకి కాల్పులు జరుగుతున్న వేళ, చైనా పీపుల్స్ ఆర్మీ కొత్త ఎత్తులు వేస్తోంది. ప్రస్తుతం సరిహద్దులకు ఆవల చైనా సైనికులు, ఇటువైపున భారత బలగాల వద్ద యుద్ధ ట్యాంకులు, హోవిట్జర్ గన్స్, భుజాలపై ఉంచుకుని ఫైరింగ్ చేయగల మిసైల్స్ తదితరాలు భారీగానే ఉన్నాయి.

ఆగస్టు 29 నుంచి కనీసం నాలుగు మార్లు ఇరు వైపుల నుంచి గాల్లోకి తూటాలు పేలాయి. ఆరో విడత కమాండర్ స్థాయి చర్చల ఫలితాల కోసం రెండు దేశాల సైన్యం ఎదురు చూస్తోంది. ఈ సమస్యకు ద్వైపాక్షిక పరిష్కారాన్ని కనుగొనేందుకు ప్రయత్నాలు సాగుతున్న వేళ, పీఎల్ఏ కొత్త ఎత్తుగడలకు దిగుతూ వ్యూహాన్ని మార్చింది.

ఓ భారత ఆర్మీ అధికారి తెలిపిన వివరాల ప్రకారం, సరిహద్దులకు లౌడ్ స్పీకర్లను తీసుకుని వచ్చిన చైనా సైనికులు పంజాబీ పాటలను వినిపిస్తూ, ఆపై హిందీలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. "అయితే, మన సైనికులు ఆ సంగీతాన్ని విని ఆస్వాదిస్తున్నారు. చైనా సైన్యం మన జవాన్లలో అసంతృప్తిని పెంచి, వారిని రెచ్చగొట్టాలని చూస్తోంది. అయితే, ఎంతో యుద్ధతంత్రం తెలిసిన మన జవాన్ల మానసిక స్థితి అందుకు లొంగడం లేదు సరికదా... వారి సంగీతాన్ని విని ఆనందిస్తున్నారు" అని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం రెండు దేశాల సైనికులూ, సముద్ర మట్టానికి ఎంతో ఎత్తున ఉన్నారు. ఇక తదుపరి సైనికాధికారుల స్థాయి చర్చలకు భారత్ సిద్ధంగానే ఉన్నా, పీఎల్ఏ మాత్రం ఇంకా తేదీని నిర్ణయించక పోవడం గమనార్హం. ఆగస్టు 2 తరువాత, దాదాపు పక్షం రోజులు గడుస్తున్నా, ఇంకా చైనా నుంచి చర్చల దిశగా అడుగులు పడలేదు. ఇక, భారత సైన్యం మంచు కొండల్లోని అత్యంత ఎత్తయిన ప్రాంతాలను ఆక్రమించి, అక్కడికి ఆయుధ సామాగ్రిని తరలించడంతో, చైనా దళాలు వెనుకంజ వేశాయని ఉన్నతాధికారులు వెల్లడించారు.

ముఖ్యంగా పాంగాంగ్, ట్సో-చుసుల్ ప్రాంతాల్లో మన సైన్యం, చైనా కన్నా ఎంతో ఎత్తులో మకాం వేయడం వారిపై స్పష్టమైన ఆధిపత్యాన్ని చూపిస్తోంది. ఈ ప్రాంతాల్లో మరింత ఎత్తయిన ప్రాంతాలకు చేరేందుకు చైనా జవాన్లు తీవ్రంగా శ్రమిస్తూ, గాల్లోకి కాల్పులు జరుపుతూ, దూకుడుగా వ్యవహరిస్తూ, ఇండియాను రెచ్చగొడుతున్నారని, భారత జవాన్లు సంయమనంతో వ్యవహరిస్తూ, వారికి అదే రీతిలో సమాధానాన్ని ఇచ్చి అడ్డుకుంటున్నారని తెలియజేశారు.

More Telugu News