Amaravati: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. సిట్ తదుపరి చర్యలను ఆపేస్తూ ఉత్తర్వులు!

  • అమరావతి భూములపై సిట్ వేసిన రాష్ట్ర ప్రభుత్వం
  • దురుద్దేశపూర్వకంగా చేస్తున్నారంటూ టీడీపీ పిటిషన్
  • ఒక ప్రభుత్వం నిర్ణయాన్ని పునఃసమీక్షించే అధికారం మరో ప్రభుత్వానికి లేదన్న న్యాయవాది
AP High Court gives stay on SIT in Amaravati lands

అమరావతి భూముల వ్యవహారానికి సంబంధించి ఏపీ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. సిట్ తదుపరి చర్యలను నిలిపేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. గత ప్రభుత్వ హయాంలో అమరావతిలో ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తూ... వాటిని పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించిన సంగతి తెలిసిందే. రాజధాని భూములపై దర్యాప్తుకు సిట్ ను ఏర్పాటు చేయాలని సదరు సబ్ కమిటీ ప్రభుత్వానికి నివేదికను అందజేసింది. ఈ నేపథ్యంలో సిట్ విచారణకు ప్రభుత్వం ఆదేశించింది.

దీనిపై టీడీపీ నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజాలు హైకోర్టును ఆశ్రయించారు. ఒక దురుద్దేశంతో, పక్కా ప్రణాళిక ప్రకారం ఇదంతా జరుగుతోందని తమ పిటిషన్ లో వారు ఆరోపించారు. ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను పునఃసమీక్షించే అధికారం మరో ప్రభుత్వానికి లేదని ఈ సందర్భంగా పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. ఈ నేపథ్యంలో సిట్ తదుపరి చర్యలు ఆపేస్తూ ఏపీ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను జారీ చేసింది.

More Telugu News