హైదరాబాద్‌ సిగలో మరో కలికితురాయి.. ముంబై-హైదరాబాద్ మధ్య బుల్లెట్ రైలు!

soon touch Bullet rail to Hyderabad
  • దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్ రైలు మార్గాలకు కేంద్రం ప్రణాళికలు
  • డీపీఆర్ సిద్ధం చేయాలని కోరిన కేంద్రం
  • మొత్తం అంచనా వ్యయం రూ. 10 లక్షల కోట్లు
హైదరాబాద్ అందాలు మరింత ఇనుమడించనున్నాయి. ఇప్పటికే మెట్రో రైళ్లను ఆస్వాదిస్తున్న భాగ్యనగర వాసులకు ఇకపై బుల్లెట్ రైళ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ముంబై నుంచి హైదరాబాద్‌కు బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టబోతోంది. దేశవ్యాప్తంగా ఏడు కొత్త బుల్లెట్ రైలు ప్రాజెక్టులకు ప్రణాళిక రచిస్తుండగా, అందులో ముంబై-హైదరాబాద్ మార్గం కూడా ఉందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

దేశవ్యాప్తంగా ఏడు కొత్త మార్గాలకు సంబంధించి డీపీఆర్ (ప్రాజెక్టు పూర్తి నివేదిక) సిద్ధం చేయాలని హైస్పీడ్ రైలు కార్పొరేషన్ (ఎన్‌హెచ్ఎస్ఆర్‌సీఎల్)ను కేంద్రం ఆదేశించిందని ఆయన వివరించారు. ఈ ప్రాజెక్టుల మొత్తం అంచనా వ్యయం దాదాపు రూ. 10 లక్షల కోట్లని పేర్కొన్నారు.

ఇక, దేశంలోనే తొలి బుల్లెట్ రైలు ప్రాజెక్టును ముంబై-అహ్మదాబాద్ మధ్య కేంద్రం చేపట్టింది. మొత్తం 508.17 కిలోమీటర్ల ఈ ప్రాజెక్టు ఇప్పటికే ప్రారంభం కాగా, దీని అంచనా వ్యయం రూ. 1.08 లక్షల కోట్లు. డిసెంబరు 2023 నాటికి బుల్లెట్ రైలు సేవలను ప్రారంభించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ భూసేకరణ సంబంధిత సమస్యలు, కరోనా వంటి సమస్యల కారణంగా ఇది అక్టోబరు 2028 నాటికి వాయిదా పడే అవకాశాలున్నాయి.
Go Back to Shorts
Hyderabad
Mumbai
Bullet Rail
NHSRCL

More Telugu News