ICMR: ఇండియాలో కరోనాపై ఆసక్తికర విషయాలు వెల్లడించిన ఐసీఎంఆర్ సీరో సర్వే!

  • మే నాటికే 64 లక్షలకు పైగా కేసులు
  • మే 11 నుంచి జూన్ 4 మధ్య సీరో సర్వే
  • గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి ఆందోళనకరం
  • బయట పడ్డ కేసులు ఒక శాతం కన్నా తక్కువే
  • సర్వే వివరాలు వెల్లడించిన ఐసీఎంఆర్
Above 64 Lakh Corona Cases by May says ICMR

ఇండియాలో ఈ సంవత్సరం మే నాటికే 64 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదై ఉండవచ్చని ఐసీఎంఆర్ నేతృత్వంలో దేశవ్యాప్తంగా జరిగిన సీరో సర్వే అంచనా వేసింది. ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఈ వివరాలను ప్రచురించింది. దేశంలోని వయో వృద్ధుల్లో 0.73 శాతం మంది వ్యాధి బారిన పడ్డారని తమ సర్వేలో తేలినట్టు పేర్కొంది. మే 11 నుంచి జూన్ 4 మధ్య 21 రాష్ట్రాల్లోని 28 వేలకు పైగా రక్త నమూనాలను సేకరించి విశ్లేషించామని ఐసీఎంఆర్ పేర్కొంది.

18 నుంచి 45 ఏళ్ల వయసులో ఉన్న వారిలో అత్యధికంగా 43.3 శాతం మంది సీరో పాజిటివ్ గా తేలారు. ఆ తరువాత 46 నుంచి 60 ఏళ్ల మధ్య వయస్కుల్లో 39.5 శాతం, 60 ఏళ్లకు పైబడిన వారిలో అతి తక్కువగా 17.2 శాతం పాజిటివ్ గా తేలారని పేర్కొంది. తమ అంచనా మేరకు మే ఆరంభానికే ఇండియాలో 64,68,388 మందికి వైరస్ సోకి ఉండవచ్చని తెలిపింది.

మే నెలలో గుర్తించిన ప్రతి కొవిడ్ కేసుకు కనీసం 82 నుంచి గరిష్ఠంగా 130 కేసులను గుర్తించ లేదని ఐసీఎంఎఆర్ సీరో సర్వే పేర్కొంది. పెద్దల్లో వైరస్ సోకిన వారిలో ఒక శాతానికన్నా తక్కువగానే కేసులు బయటకు వచ్చాయని, ఈ లెక్కన ఇండియాలో అత్యధికుల్లో ఈ వైరస్ ఇప్పటికే చేరిపోయి ఉంటుందని అంచనా వేసింది. ఇక తొలి దశలో అధిక కేసులను గుర్తించిన జిల్లాల్లో మే నాటికి వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నా, అత్యధికుల్లో లక్షణాలు బయటపడకుండానే వ్యాధి తగ్గిపోయిందని సర్వే పేర్కొంది.

మే తరువాతే ఇండియాలో గ్రామీణ ప్రాంతాలకు వైరస్ వ్యాప్తి పెరిగిందని పేర్కొంది. ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లోని గ్రామాల్లోకి, చిన్న పట్టణాలకు సైతం వైరస్ విస్తరించడం ఆందోళన కలిగిస్తోందని తెలిపింది. ఒక్క కేసు కూడా రాని జిల్లాల్లో కూడా చాలా మందిలో వైరస్ బయటపడిందని, టెస్టుల సంఖ్యను మరింతగా పెంచితే, కేసుల సంఖ్య నమ్మశక్యం కాని స్థాయిలో కనిపిస్తుందని అంచనా వేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సీరో పాజిటివిటీ రేటు అత్యధికంగా 69.4 శాతంగా ఉండగా, పట్టణ ప్రాంతాల్లోని మురికివాడల్లో 15.9 శాతంగా, మిగతా ప్రాంతాల్లో 14.6 శాతంగా ఈ రేటు ఉందని ఐసీఎంఆర్ పేర్కొంది.

More Telugu News