IPL: ఐపీఎల్ 2020 విజేత ఎవరో జోస్యం చెప్పిన బ్రెట్ లీ!

  • 19 నుంచి ప్రారంభం కానున్న ఐపీఎల్
  • చెన్నై సూపర్ కింగ్స్ విజేతగా నిలిచే అవకాశాలు
  • ఫ్యాన్స్ వేసిన ప్రశ్నలకు బ్రెట్ లీ సమాధానం
Brett Lee Picks CSK as IPL 13th Season Winner

మరో ఎనిమిది రోజుల్లో ఐపీఎల్ 2020 సీజన్ దుబాయ్ లో ప్రారంభం కాబోతోంది. తొలి మ్యాచ్ సెప్టెంబర్ 19న గతసంవత్సరం విజేత ముంబై ఇండియన్స్, రెండో స్థానంలో నిలిచిన చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య జరుగనుందన్న సంగతి తెలిసిందే. ఇక ఈ సంవత్సరం ఐపీఎల్ లో ఎవరు విజేతగా నిలుస్తారన్న విషయమై ఆస్ట్రేలియా మాజీ ఫాస్ట్ బౌలర్ బ్రెట్ లీ జోస్యం చెప్పాడు. ధోనీ నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, 13వ సీజన్ కప్ ను ఎగరేసుకుపోతుందని అంచనా వేశాడు.

ఐపీఎల్ కవరేజ్ నిమిత్తం ముంబైకి చేరుకున్న బ్రెట్ లీ, కొవిడ్ నిబంధనల ప్రకారం, ప్రస్తుతం ఐసొలేషన్ లో ఉన్నాడు. తాను ఆడుతున్న సమయంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా బౌలింగ్ చేసేవాడన్న పేరు తెచ్చుకున్న బ్రెట్ లీ, తాజాగా, ఇన్ స్టాగ్రామ్ వేదికగా, తన అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. ఇందులో భాగంగానే, ఐపీఎల్ 2020 చాంపియన్స్ ఎవరన్న ప్రశ్న ఆయనకు ఎదురైంది. "చెప్పడం కాస్తంత కష్టమే. నేను మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ వైపే వుంటాను" అని బ్రెట్ లీ సమాధానం ఇచ్చాడు.

కాగా, ఇటీవలి కాలంలో సీఎస్కే జట్టు తరచూ వార్తల్లో నిలుస్తూ వచ్చిందన్న సంగతి తెలిసిందే. తొలుత టీమ్ లో 13 మంది కరోనా బారిన పడటం, ఆపై వ్యక్తిగత కారణాలతో సురేశ్ రైనా దూరం కావడం, ఆ వెంటనే హర్భజన్ సైతం ఈ సీజన్ ఆడటం లేదని చెప్పడం జరిగింది. అయినప్పటికీ, సీఎస్కే మేనేజ్ మెంట్ మాత్రం, తమ జట్టు చాలా బలంగా ఉందన్న నమ్మకాన్ని వ్యక్తీకరిస్తోంది. మూడు సార్లు తన ఫ్రాంచైజీకి ఐపీఎల్ ట్రోఫీని అందించిన ధోనీ అనుభవం, ఈ మారు కూడా ఉపకరిస్తుందని సీఎస్కే ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు.

బ్రెట్ లీ గతంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కోల్ కతా నైట్ రైడర్స్ జట్ల తరఫున ఆడాడన్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం కేకేఆర్ జట్టుకు పాట్ కమిన్స్ వెన్నుదన్నుగా నిలుస్తాడని, కేకేఆర్ జట్టు ప్లే ఆఫ్స్ వరకూ వెళుతుందని అంచనా వేస్తున్నానని చెప్పాడు. కేకేఆర్ కు ఈ సంవత్సరం దినేశ్ కార్తీక్ నాయకత్వం వహిస్తుండగా, 23న తమ తొలి మ్యాచ్ ని అబూదాబిలో ముంబై ఇండియన్స్ తో ఆడనుంది.

More Telugu News