అమరావతిలో జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమే: జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ జగన్

there is real estate business in Amaravathi says ys jaganmohan reddy
  • చంద్రబాబు, ఆయన బినామీల లావాదేవీలు వెలికి తీసే పనిలో ఉన్నాం
  • అభివృద్ధి వికేంద్రీకరణమే మా మొదటి లక్ష్యం
  • జాతీయ రాజకీయాలపై మాకు ఆసక్తి లేదు
అమరావతిలో జరిగింది రియల్ ఎస్టేట్ వ్యాపారం మాత్రమేనని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ఓ ఆంగ్లపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్ మాట్లాడుతూ అభివృద్ధి వికేంద్రీకరణ, జాతీయ రాజకీయాలు, బీజేపీకి మద్దతు, మూడు రాజధానులు వంటి అంశాలపై మాట్లాడారు. అభివృద్ధి అంతా ఒకే చోట ఉండాలనుకోవడం భావ్యం కాదని, ఆంధ్రప్రదేశ్ మొత్తాన్ని అభివృద్ధి చేయాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు. మూడు రాజధానుల ఆలోచన నిజానికి సామాన్యుల ఆలోచన అని, విశాఖపట్టణం నుంచి కార్య నిర్వాహక, అమరావతి నుంచి శాసన, కర్నూలు నుంచి న్యాయ వ్యవస్థ విధుల నిర్వహణ జరుగుతుందని జగన్ పేర్కొన్నారు. చెన్నై, హైదరాబాద్ నగరాల్లో అన్నిటినీ ఒకే చోట కేంద్రీకరించడం వల్ల ఏపీ రెండుసార్లు దారుణంగా నష్టపోయిందని అన్నారు.

హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో 1990లో జరిగిన ఇన్‌సైడర్ ట్రేడింగ్ విధానమే మళ్లీ అమరావతిలో జరిగిందని అన్నారు. రాజధాని నిర్మాణానికి లక్ష కోట్ల రూపాయలు కావాలని గత ప్రభుత్వం చెప్పిందని, రైతుల నుంచి సమీకరించిన 33 వేల ఎకరాల భూమిలో పెద్ద భవనాల నిర్మాణాలకు అనువుగా లేని చోట ఒక నగరాన్ని నిర్మించడం కన్నా, 500 ఎకరాల్లో మరో చోట చంద్రబాబు నాయుడు నిర్మాణానికి ప్రయత్నించి ఉండొచ్చని అన్నారు.

అమరావతిలో జరిగిన భూ లావాదేవీలపై ప్రత్యేక బృందం దర్యాప్తు చేస్తోందన్న జగన్.. చంద్రబాబు,  ఆయన మనుషుల బినామీ లావాదేవీలను వెలికి తీసే పనిలో ఉందన్నారు. పేద రైతుల నుంచి భూములు కొనుగోలు చేసిన తర్వాతే అక్కడ రాజధానిని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటన వెలువడిందన్నారు. అక్కడ భూ కుంభకోణం జరిగిందని, కోట్లాది రూపాయలు లబ్ధి పొందారని జగన్ చెప్పారు. అక్కడ కేవలం ఒక వర్గానికి మాత్రమే ప్రయోజనం చేకూరిందన్నారు. అభివృద్ధిని రాష్ట్రమంతటికీ విస్తరిస్తే అన్ని చోట్లా భవిష్యత్తులో గ్రోత్ సెంటర్లు అవుతాయన్నారు.

కేరళలో పెద్ద నగరాలు లేకున్నా అన్ని రాష్ట్రాల కంటే ప్రమాణికాల్లో ముందున్నదని జగన్ వివరించారు. అభివృద్ధిని వికేంద్రీకరిస్తే విశాఖపట్టణం, అనంతపురం, కర్నూలు, తిరుపతి వంటి నగరాల్లో అభివృద్ధి క్లస్టర్లు ఉంటాయని, పోర్టుల అభివృద్ధి కూడా జరుగుతుందని అన్నారు. మధ్య కోస్తాలో అగ్రోలాజిస్టిక్ పార్కును ఏర్పాటు చేయొచ్చన్నారు.

చంద్రబాబును చులకన చేయడం కోసమే అమరావతిని నిర్వీర్యం చేస్తున్నారన్న విమర్శలను జగన్ కొట్టిపడేశారు. అది నిజం కాదని, తాను యావత్ రాష్ట్రాభివృద్ధి గురించి మాత్రమే మాట్లాడుతున్నానని, తాము అమరావతిని వదిలిపెట్టబోమని అన్నారు. శాసనసభ అక్కడే ఉంటుందన్నారు. మన దేశంలో ప్రజాభిప్రాయ సేకరణ విధానం లేదని, అందుకే నిపుణుల అభిప్రాయాలను గౌరవించడం లేదని జగన్ పేర్కొన్నారు. అదే కనుక ఉండి ఉంటే ఈనాడు దానిని అనుసరించి ఉండేవాళ్లమని అన్నారు.

అభివృద్ధి వికేంద్రీకరణపై రెఫరెండం నిర్వహించి ఉంటే ఆ 29 గ్రామాల్లోని పదివేల మంది రైతులు తప్ప మిగతా రాష్ట్రమంతా మద్దతు ఇచ్చేవారని జగన్ వివరించారు. కమిటీ నివేదికల ఆధారంగానే అభివృద్ధి వికేంద్రీకరణకు ముందడుగు వేశామని, ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను విభజించి కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని అన్నారు. అన్ని జిల్లాలలోనూ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు, వైద్య కళాశాలలు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.

గూఢచర్యం విషయంలో చంద్రబాబు ఆరోపణ పూర్తిగా అర్థరహితమని జగన్ కొట్టిపడేశారు. సాక్ష్యాలు ఇవ్వాలని స్వయంగా డీజీపీ అడిగినా ఇవ్వలేకపోయారన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తమ సీనియర్ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తే అందుకు సంబంధించిన ఆధారాలను చూపించామన్నారు. గత 15 నెలలుగా చంద్రబాబు అమరావతి గురించి తప్ప మరే విషయం గురించి మాట్లాడడం లేదని, తామైతే అభివృద్ధి వికేంద్రీకరణకే కట్టుబడి ఉన్నామని అన్నారు. రాష్ట్రం మొత్తం కరోనాతో పోరాడుతుంటే మార్చి తర్వాత చంద్రబాబు ఏపీలో అడుగుపెట్టలేదని విమర్శించారు.

జాతీయ రాజకీయాలపై జగన్ మాట్లాడుతూ.. తమది ఆంధ్రప్రదేశ్‌లో ఒక బలమైన పార్టీ అని, అయితే జాతీయ స్థాయిలో రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో తమకు సంఖ్యాబలం లేదని జగన్ స్పష్టం చేశారు. లోక్‌సభలో వైసీపీ నాలుగో అతిపెద్ద పార్టీ అయినప్పటికీ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకునే ప్రక్రియలో ఉన్నామని, కాబట్టి జాతీయ రాజకీయాలపై తమకు ఎలాంటి ఆసక్తి లేదని తేల్చిచెప్పారు. తమకు రాష్ట్రప్రయోజనాలే ముఖ్యం కాబట్టి ఆ దారిలోనే వెళ్తామని, బీజేపీకి అంశాల వారీగా మద్దతు ఇస్తామని జగన్ స్పష్టం చేశారు.
Go Back to Shorts
YSRCP
YS Jagan
Andhra Pradesh
Amaravati
Hindustan times

More Telugu News