Bipin Rawat: భారత సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉంది: చైనాతో ఉద్రిక్తతలపై బిపిన్ రావత్‌

  • దుందుడుకు చర్యలకు పాల్పడితే చైనాకు తగిన రీతిలో బదులిస్తాం
  • భారత్ ఎన్నో సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోంది
  • చైనా చర్యలను భారత్‌ నిశితంగా గమనిస్తోంది
  • పాక్ దుస్సాహసానికి దిగితే ఆ దేశం తీవ్రంగా నష్టపోతుంది
bipin rawat on china ind standoff

భారత్‌-చైనా సరిహద్దులో డ్రాగన్ దేశం చర్యల వల్ల మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. చైనా దుందుడుకు చర్యలకు దీటుగా ప్రతిస్పందించేందుకు భారత ఆర్మీ సర్వసన్నద్ధమైంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో చైనా సైన్యాన్ని నిలువరించింది. తూర్పు లడఖ్‌లోని కొన్ని ప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు చైనా ప్రయత్నించగా భారత్‌ అప్రమత్తమై అడ్డుకుంది.

దీనిపై భారత  త్రిదళాధిపతి (సీడీఎస్‌) బిపిన్ రావత్ స్పందిస్తూ... చైనాకు తగిన రీతిలో బదులిచ్చేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని చెప్పారు.  అణు యుద్ధం నుంచి సంప్రదాయ యుద్ధాల వరకు దేశం ఎన్నో సంక్లిష్టమైన సవాళ్లను ఎదుర్కొంటోందని చెప్పారు. వాటిన్నింటినీ సమర్థంగా తిప్పికొట్టేందుకు సాయుధ బలగాలు సంసిద్ధంగా ఉన్నాయని తెలిపారు.

టిబెట్‌లోని తమ స్థావరాలతో సరిహద్దుల్లో మౌలిక సదుపాయాల కల్పనలో చైనా చర్యలను భారత్‌ నిశితంగా గమనిస్తోందని చెప్పారు. ఒకవేళ చైనాతో సరిహద్దు వివాదాన్ని ఆసరాగా తీసుకుని పాక్ దుస్సాహసానికి దిగితే ఆ దేశం తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు.

సరిహద్దుల వద్ద ప్రమాదాలను ఎదుర్కొనేందుకు వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పారు. పాక్‌‌ ఆక్రమిత కశ్మీర్‌కు చైనా ఆర్థిక సహాయం అందిస్తోందని, పాక్‌కు సైనిక, దౌత్యపరంగా మద్దతు ఇస్తోందని చెప్పారు. ఆ కుట్రలన్నింటినీ సమర్థంగా తిప్పి కొట్టగల శక్తి భారత్‌కు ఉందని ఆయన తెలిపారు.

More Telugu News