Bipin Rawat: చర్చలు విఫలమైతే సైనిక చర్యలకు సిద్ధం.. చైనాకు తేల్చిచెప్పిన బిపిన్ రావత్

  • చైనా దుందుడుకు చర్యలపై  స్పందన
  • ఏప్రిల్‌కి ముందున్న యథాతథ స్థితికి భారత్ డిమాండ్  
  • తిప్పికొట్టడానికి భారత సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉంది
  • ఇందుకు తగ్గ  ప్రతిపాదన మా వద్ద సిద్ధం
bipin rawat gives warning to china

చైనా దుందుడుకు చర్యలపై భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ స్పందిస్తూ డ్రాగన్ దేశానికి హెచ్చరిక చేశారు. చైనా చర్యలను తిప్పికొట్టడానికి భారత సైన్యం పూర్తిగా సిద్ధంగా ఉందని తెలిపారు. భారత్‌-చైనా మధ్య జరుగుతోన్న చర్చలు విఫలమైతే తాము సైనికపర చర్యలకు సిద్ధమని ప్రకటించారు. ఇందుకు తగ్గ  ప్రతిపాదన తమ వద్ద సిద్ధంగా ఉందని తెలిపారు.

సరిహద్దుల వద్ద చైనా దుందుడుకు చర్యలను నిరోధించేందుకు రక్షణ దళాలు నిరంతరం పర్యవేక్షిస్తూనే ఉన్నాయని చెప్పారు. భారత ప్రభుత్వం శాంతియుతంగానే పరిష్కారం కోరుతోందని, అయితే చర్చలు ఫలించకపోతే ఆర్మీని రంగంలోకి దింపడానికి, యుద్ధానికి సిద్ధమని చెప్పారు.

కాగా, విభేదాలు వివాదాలుగా మారకుండా ఉండేందుకు భారత్‌-చైనా కొన్ని రోజులుగా చర్చలు జరుపుతున్నాయి. ఏప్రిల్‌కి ముందు ఉన్న యథాతథ స్థితిని చైనా ఆర్మీ కొనసాగించాలని భారత సైన్యం పట్టుబడుతోంది. అయితే, ఇందుకు చైనా ఆర్మీ ససేమిరా అంటుండడంతో భారత్‌ తదుపరి చర్యలకు సిద్ధమవుతోంది.

కాగా, ఇప్పటికే గాల్వన్ లోయతో పాటు పలు ప్రదేశాల నుంచి చైనా సైన్యం వెనక్కి వెళ్లింది. అయితే, పాంగాంగ్ త్సో, డెప్సాంగ్ వంటి ప్రాంతాల నుంచి వైదొలగడం లేదని సమాచారం. ఈ నేపథ్యంలో బిపిన్ రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News