Hindi: హిందీ తెలియనివాళ్లు బయటికి వెళ్లిపోవాలన్న ఆయుష్ విభాగం కార్యదర్శి... తమిళ సంఘాల ఆగ్రహం

  • ఆన్ లైన్ సమావేశం నిర్వహించిన ఆయుష్ కార్యదర్శి
  • తమిళనాడులో మరోసారి ఆగ్రహజ్వాలలు
  • కేంద్రం స్పందించాలన్న కనిమొళి
Kanimozhi and Tamil associations furious over Ayush secretary language remarks

తమిళుల భాషాభిమానం ఎంత తీవ్రమైనదో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. హిందీ భాషకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేసిన చరిత్ర వారిది. తాజాగా, ఓ కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి చేసిన వ్యాఖ్యలు తమిళుల్లో ఆగ్రహజ్వాలలు రగిల్చాయి. కేంద్ర ప్రభుత్వ ఆయుష్ విభాగం కార్యదర్శి రాజేశ్ కోటేచా ఆన్ లైన్ సమావేశం నిర్వహించారు. అయితే, హిందీ రానివాళ్లు ఈ సమావేశం నుంచి వెళ్లిపోవచ్చని కోటేచా పేర్కొన్నారు. దీనిపై తమిళ సంఘాల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది.

తమిళులపై హిందీని ఉద్దేశపూర్వకంగా రుద్దే ప్రయత్నంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని సంఘాల నేతలు మండిపడ్డారు. హిందీ భాష రాదంటూ తమిళులను ఇంకా ఎన్నాళ్లు అవమానిస్తారని ప్రశ్నించారు. ఈ వ్యవహారం పట్ల డీఎంకే ఎంపీ కనిమొళి కూడా స్పందించారు.

ఆయుష్ కార్యదర్శి రాజేశ్ కోటేచా వ్యాఖ్యలపై కేంద్రం స్పందించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇటీవల కనిమొళికి విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్టులో సీఐఎస్ఎఫ్ అధికారిణి కనిమొళితో మాట్లాడుతూ, "మీరసలు భారతీయులేనా?" అంటూ వ్యాఖ్యానించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.

More Telugu News