కరోనాతో ఇస్రో సంచలన నిర్ణయం... శ్రీహరికోట కార్యకలాపాల తగ్గింపు... ఈ ఏడాది ఒకే ప్రయోగం!
- తాజాగా 20 మందికి వైరస్
- సూళ్లూరుపేటలో పెరుగుతున్న కేసులు
- షార్ ను తాత్కాలికంగా మూసేస్తున్నామన్న అధికారులు
ఈ మేరకు షార్ నియంత్రణాధికారి వీ కుంభకర్ణన్ తాజా మార్గదర్శకాలను జారీ చేశారు. ఆయన పేర్కొన్న వివరాల ప్రకారం, షార్ సహా, సమీపంలోని పట్టణమైన సూళ్లూరుపేటలో కొవిడ్-19 కేసుల సంఖ్య పెరగడం, వారి చుట్టుపక్కలే శ్రీహరికోట ఉద్యోగులు ఉండటం, వారు కూడా మహమ్మారి బారిన పడుతుండటంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు.
షార్ కేంద్రంలో వైరస్ ప్రబలకుండా, రెండు రోజుల పాటు కార్యాలయం ప్రాంగణమంతా ఫ్యుమిగేషన్, శానిటైజేషన్ చేయించాలని నిర్ణయించామని, ఇందుకు కొంత సమయం పడుతుంది కాబట్టి, ఉద్యోగుల భద్రత నిమిత్తం అన్ని కార్యకలాపాలనూ నిలిపివేసినట్టు తెలిపారు. కాగా, లాక్ డౌన్ అమలులోకి వచ్చిన తరువాత తొలి దశలో 30 శాతం మందితో, ఆపై 50 శాతం మందితో శ్రీహరికోట కార్యకలాపాలు జరిగాయి. ఇకపై రాకెట్ లాంచ్ స్టేషన్ లో అత్యవసర పనుల నిమిత్తం అతి కొద్ది మందిని మాత్రమే అనుమతిస్తామని, మిగతా వారిలో ఇంటి నుంచి పనిచేసే అవకాశమున్న ప్రతి ఒక్కరికీ అనుమతిస్తామని స్పష్టం చేశారు.