Kozhikode: 'కోజికోడ్' రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా.. 600 మంది క్యారంటైన్ కు!

  • విమాన ప్రమాదంలో 18 మంది మృతి
  • మూడు గంటలకు పైగా కొనసాగిన రెస్క్యూ ఆపరేషన్
  • ప్రమాద సమయంలో విమానంలో 184 మంది ప్రయాణికులు
22 Kerala Officials Involved In Plane Crash Rescue Ops Test Positive

కేరళలోని కోజికోడ్ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న విమానం ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. టేబుల్ టాప్ వంటి ఆ విమానాశ్రయంలో విమానం రన్ వే మీద నుంచి జారిపోయి రెండు ముక్కలైంది. దుబాయ్ నుంచి వచ్చిన విమానంలో ప్రమాద సమయంలో 184 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇద్దరు పైలట్లు సహా మొత్తం 18 మంది ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయారు. విమానంలో చిక్కుకుపోయిన వారిని వెలికి తీసేందుకు దాదాపు మూడు గంటలకు పైగా సమయం పట్టింది.

మరోవైపు రెస్క్యూ ఆపరేషన్ లో పాల్గొన్న 22 మంది అధికారులకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఈ విషయాన్ని మలప్పురం వైద్యాధికారి తెలిపారు. రెస్క్యూ ఆపరేషన్ పూర్తైన తర్వాత వీరిని క్వారంటైన్ కు తరలించారని చెప్పారు. ప్రమాదం జరిగిన తర్వాత స్థానికులతో పాటు దాదాపు 600 మందిని క్యారంటైన్ కు వెళ్లాలని సూచించడం జరిగిందని తెలిపారు. వీరిలో ఎంత మంది కరోనా బారిన పడ్డారనే విషయంపై జిల్లా వైద్యాధికారులు ప్రస్తుతం సమీక్ష నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.

More Telugu News