AP High Court: జడ్జి రామకృష్ణ పిటిషన్ పై హైకోర్టు కీలక ఆదేశాలు

  • జడ్జి రామకృష్ణ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు
  • పెన్ డ్రైవ్ లో సమాచారం నిజనిర్ధారణకు ప్రత్యేక అధికారి
  • తదుపరి విచారణ నాలుగు వారాలకు వాయిదా
AP High Court appoints special legal official

ఏపీ హైకోర్టు ప్రాంతాన్ని రెడ్ జోన్ గా ప్రకటించాలని, హైకోర్టు ఇన్ చార్జి రిజిస్ట్రార్ జనరల్ రాజశేఖర్ మృతిపై దర్యాప్తుకు ఆదేశించాలని కోరుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ విద్యార్థి సమాఖ్య సభ్యుడు లక్ష్మీనరసయ్య హైకోర్టులో పిటిషన్ వేయడం తెలిసిందే.

ఈ పిటిషన్ పై విచారణ సమయంలో జడ్జి రామకృష్ణ ఇంప్లీడ్ పిటిషన్ వేశారు. రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య హైకోర్టు న్యాయమూర్తులపై వ్యాఖ్యలు చేశారంటూ జడ్జి రామకృష్ణ తన పిటిషన్ లో ఆరోపించారు. ఈ మేరకు ఓ పెన్ డ్రైవ్ ను ఆయన కోర్టుకు సమర్పించారు. తాజాగా, ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది.

జడ్జి రామకృష్ణ సమర్పించిన పెన్ డ్రైవ్ లోని సంభాషణలు నిజమా, కాదా అనేది నిర్ధారించాలని కోరుతూ సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ ను న్యాయాధికారిగా నియమించింది. వీలైనంత త్వరగా నిగ్గు తేల్చాలని జస్టిస్ రవీంద్రన్ కు స్పష్టం చేసింది. తప్పనిసరి అయితే ఈ వ్యవహారంలో సీబీఐ, కేంద్ర విజిలెన్స్ అధికారులు సహకరించాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను మరో 4 వారాలకు వాయిదా వేసింది.

More Telugu News