Corona Virus: 'ఆర్‌ఎల్‌ఎఫ్‌-100' ఔషధంతో వేగంగా కోలుకుంటోన్న కరోనా రోగులు

  • శుభవార్త తెలిపిన అమెరికా పరిశోధకులు 
  • ఔషధంపై రెండో దశ ప్రయోగ పరీక్షలకు సిద్ధం
  • వెంటిలేటర్లపై  ఉన్న రోగులకు ఇప్పటికే తొలిదశ పరీక్షలు
  • మూడు రోజులకే వారి ఆరోగ్య పరిస్థితి మెరుగు
rlf for corona tratment

కరోనా చికిత్సకు సరైన ఔషధాల కోసం ప్రయత్నిస్తున్న అమెరికా పరిశోధకులు ఓ శుభవార్త తెలిపారు. న్యూరో ఆర్‌ఎక్స్‌ సంస్థ అభివృద్ధి చేసిన 'ఆర్‌ఎల్‌ఎఫ్‌-100' ఔషధంతో శ్వాసవ్యవస్థలో సమస్యను ఎదుర్కొంటున్న బాధితులు త్వరగా కోలుకుంటున్నారని తెలిపారు.

ప్రస్తుతం ఆ దేశ ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్‌డీఏ) ఈ ఔషధంపై రెండో దశ ప్రయోగ పరీక్షలు చేయనుంది. శ్వాసకోశ సమస్యలు ఎదుర్కొంటూ హ్యూస్టన్‌ మెథడిస్ట్‌ ఆసుపత్రిలో వెంటిలేటర్లపై చికిత్స తీసుకుంటోన్న రోగులకు తొలుత ఈ ఔషధాన్ని అందించి పరీక్షించారు.

దీంతో మూడు రోజులకే వారి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడింది. ముక్కు ద్వారా పీల్చే ఈ మందుకు ‘అవిప్టడిల్‌’ అనే పేరూ ఉంది. ఊపిరితిత్తుల్లో అధిక సాంద్రతతో ఉండి, అక్కడ వాపులకు కారణమయ్యే సైటోకీన్లను ఇది నియంత్రిస్తుందని, ఊపిరితిత్తుల కణాలు, ఏక కేంద్ర తెల్ల రక్తకణాల్లో కరోనా వైరస్ సంఖ్య పెరగకుండా ఆర్‌ఎల్‌ఎఫ్‌-100 నిరోధిస్తోందని వివరించారు.

ఈ ఔషధం రోగుల్లో న్యుమోనియాను తగ్గించిందని, అంతేకాకుండా, బ్లడ్‌-ఆక్సిజన్‌ స్థాయిని కూడా ఇది మెరుగుపరిచిందని వివరించారు. దీంతో వెంటిలేటర్లపై ఉన్న కరోనా బాధితులు వేగంగా కోలుకున్నట్లు హ్యూస్టన్ మెథడిస్ట్ ఆసుపత్రి ప్రకటన చేసింది.

ఈ ఔషధానికి పేటెంట్‌ హక్కులు కలిగి ఉన్న స్విట్జర్లాండ్‌ కంపెనీ రిలీఫ్‌ థెరపాటిక్స్‌, ఇజ్రాయెలీ-అమెరికన్‌ సంస్థ న్యూరోఆర్‌ఎక్స్‌తో కలిసి రెండో దశ ప్రయోగాలను వచ్చేనెల 1 నుంచి నిర్వహించనున్నారు. ఈ ఔషధంతో కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు గత నెలలో అనుమతులు లభించాయి. దీంతో ఇప్పటికే ఈ ఔషధాన్ని తొలిదశలో రోగులపై పరీక్షించారు.

More Telugu News